కర్బన ఉద్గరాలతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదీ భారత్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుదల ఉండటంతో జీవరాశుల మనుగడకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం జరిపించిన అధ్యయనంలో తేలింది. 1901 నుంచి 1918 మధ్య భారత్లో వాతావరణ ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్ పెరగ్గా, 2,100 సంవత్సరాంతానికి దేశంలో ఉష్ణోగ్రత 4.4 డిగ్రీల సెల్సియస్, అంటే ఇప్పటి కంటే నాలుగింతలు పెరగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. 1976 నుంచి 2005 వరకు 30 ఏళ్ల కాలంలో పెరిగిన సగటు ఉష్ణోగ్రతకు ఈ పెరగనున్న ఉష్ణోగ్రత సమానమని కేంద్రంకు సమర్పించిన నివేదికలో అధ్యయన బృందం స్పష్టం చేసింది.
‘అసిస్మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఒవరి ది ఇండియన్ రీజియన్’ పేరిట కేంద్ర ప్రభుత్వం వాతావరణ మార్పులపై నివేదికను విడుదల చేసింది. ఈ అధ్యయనంలో కర్బణ ఉద్ఘారాల కారణంగానే ఉష్ణోగ్రత పెరుగుతోందని నివేదిక వెల్లడించింది. జనాభా పెరుగుదల, జంతువుల సంఖ్యలో పెరుగుదల, తలసరి మాంస ఉత్పత్తి, అంతర్జాతీయంగా వృక్షాల నరికివేత, శిలాజ ఇంధనాల వినియోగం, ఇతర సూచీల ఆధారంగా ఈ అధ్యయనం సాగించారు. కర్బన ఉద్గారాలను, అడవుల నరికివేతను, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవడం లాంటి చర్యల ద్వారా వాతావరణ మార్పులను ఎదుర్కోవాలని, లేదంటే ఇప్పటివరకు ఎదురైన దుష్ప్రభావాల కంటే తీవ్రమైన పర్యవసానాలు భవిష్యత్తులో ఎదురవుతాయని, వాతావరణ అత్యవసర పరిస్థితి అంటే ఇదేనని అధ్యయనం బృందం సభ్యులు నివేదికలో పేర్కొన్నారు.
దేశ ఉష్ణోగ్రత దాదాపు నాలుగు డిగ్రీలు పెరగడమంటే వడగాలులు కూడా నాలుగింతలు పెరగడమే. ఇది పర్యావరణ సమతౌల్యంపైనే కాకుండా వ్యవసాయం, నీటి వనరులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా నీటి వనరులు బాగా తరగిపోతాయి. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పడిపోతాయి. పర్యవసానంగా జీవ వైవిధ్యంపై ప్రభావంతోపాటు ఆహారం కొరత ఏర్పడుతుంది. తద్వారా ప్రజారోగ్యం దెబ్బతింటుందని బృందం నివేదికలో తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని రకాల మొక్కలు, జంతువులు నశించి పోతున్నాయని, నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఇవి మరింత వేగంగా నశించిపోయే ఆస్కారం ఉందని నివేదికలో ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచం మొత్తం మీద భూ ఉష్ణోగ్రత సరాసరి మూడు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని నివేదిక అంచనా వేసింది.