తెలంగాణలో విద్యుత్ శాఖలో కరోనా కలకలం నెలకొంది. కరోనా మహమ్మారితో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు శనివారం మృతి చెందడంతో ఆ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. జీహెచ్ ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్ లో అసిస్టెంట్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వ్యక్తి శనివారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే ఐడీబీఎల్లో విద్యుత్ అధికారిగా పనిచేస్తున్న మూర్తి అనే వ్యక్తి శనివారం చికిత్స పొందుతూ మరణించాడు. ఇదిలా ఉండగా వీరితో పాటు మరికొంతమంది విద్యుత్ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇలా కరోనా బారిన పడ్డ వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం ఆందోళనకు గురి చేస్తోందని చెప్పాలి.
ఇదిలా ఉండగా కొల్చారం మండలం కు చెందిన రిటైర్డ్ టీచర్ కొంత కాలంగా హైదరాబాదు నివాసంలో ఉంటున్నాడు. అనారోగ్యం కారణంతో హాస్పిటల్ చేరిన వ్యక్తి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతున్న ఆయన శనివారం మధ్యాహ్నం మరణించాడు. కొల్చారం మండలం స్వగ్రామం రాంపూర్ గ్రామానికి మృతదేహాన్ని తరలించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ అధికారుల ఆదేశాలు, పోలీసు బందోబస్తు మధ్య శవాన్ని బంధువులు ఖననం చేశారు. ఇదిలా ఉండగా నల్లగొండ జిల్లాలో శనివారం ఒక్క రోజే 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఎక్కువగా పోలీసు సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
జిల్లా ఎస్పీ గన్ మెన్ తో పాటు ఆఫీసులో పనిచేసే మరో ముగ్గురికి పాజిటివ్ గా వచ్చినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. టూ టౌన్ పీఎస్ లోని ఒకరికి కూడా పాసిటివ్ వచ్చినట్లు చెప్పారు. ఈ నెల 23వ తేదీన 72 శ్యాంఫుల్స్ సేకరించగా అందులో 18 మందికి, 24 వ తేదీన సేకరించిన శ్యాంఫుల్స్ లో ఏడుగురికి పాజిటివ్ గా వచ్చినట్లు తెలిసింది. ఈ రాత్రి వరకు ఇంకా కొందరి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉన్నది.