దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 6 లక్షల 4,641 కు చేరుకుంది. ఇందులో 3,59,859 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. 2,26,947 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 19,148 కొత్త కేసులు నమోదు కాగా, 434 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందినవారి సంఖ్య 17,834 కు పెరిగింది.వచ్చ పదిరోజుల్లో కరోనా తారస్థాయికి చేరుకుంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే స్వీయ నియంత్రణ, కంటోన్మెంట్ల నిర్వహణ సక్రమంగా సాగితే కొద్దిమేర తగ్గవచ్చన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా ఈ నాలుగు రాష్ట్రాల నుంచే కేసుల నమోదు ఉంటోంది. ఇక తెలంగాణలోనూ వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు ఇక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ పోతునే ఉంది. అయితే రికవరీల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండటం కాస్త మెరుగైన పరిస్థితి ఉందని చెప్పాలి. మిగతా రాష్ట్రాలతో పొల్చి నప్పుడు ఇక్కడ రికవరీల సంఖ్య మెరుగ్గా ఉంది. అయితే తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజల్లో కలవరం రేపుతుంది.
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా నిర్థారణ పరీక్షలు తొమ్మిది లక్షల మార్కును అధిగమించాయి. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 వరకు 28,239 పరీక్షలు నిర్వహించడం గమనార్హం. మొత్తం పరీక్షలు 9,18,429కి చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 477 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 6,988కు చేరింది. కొత్తగా 657 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసులు 15,252కి చేరాయి. వీటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన కేసులు 2,036 ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారికి సంబంధించినవి 736. కొత్తగా ఆరుగురి మృతితో మొత్తం మరణాల సంఖ్య 193కి చేరింది. యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి.