హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ల్యాబ్ కరోనా నిర్ధారణ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అనేక అనుమానాలను వ్యక్తం చేస్తూ ఏకంగా తనిఖీలు నిర్వహించాలని ఆరోగ్య నిపుణుల కమిటీకి ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇంతకు ఏం జరిగిందంటే హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో జరిగిన పరీక్షలో అత్యధికంగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్ ఇచ్చింది. అంటే మొత్తం పరీక్షల్లో 71.7 శాతం కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చిందన్న మాట. ఒకే ల్యాబ్ నుంచి ఇన్ని పరీక్షల్లో పాజిటివ్ రావడమేంటని వైద్య ఆరోగ్యశాఖ అనుమానాలు వ్యక్తం చేసింది.
ఈ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను మరోసారి తెలంగాణ ప్రభుత్వం పరిశీలించనుంది. వెంటనే ల్యాబ్ ను పరిశీలించాలని ఎక్స్ పర్ట్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. రిపోర్టులను ఎక్స్ పర్ట్ కమిటీ పరిశీలించే వరకు ఆ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలను తాత్కాలికంగా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. వారంలో రెండు మూడ్రోజులు కేసులు తగ్గడం మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయ్. దీంతో ప్రజలు.. మరీ ముఖ్యంగా నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు ఎవరూ ఊహించనివిధంగా పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో జనం ఆందోళనతో ఊర్ల బాట పట్టారు. తెలంగాణలో శుక్రవారం (జులై 3) రికార్డు స్థాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేల మార్క్ దాటింది. కొవిడ్-19 కారణంగా రాష్ట్రంలో మరో 8 మంది మరణించడంతో మొత్తం మరణించిన వారి సంఖ్య 283కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,195 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 9,984 యాక్టివ్ కేసులు ఉన్నాయని హెల్త్ బులెటిన్లో తెలిపారు.