కరోనా టెస్టులకు ఉన్న ఆటంకాలను ఐసీఎంఆర్ ఒక్కోటిగా తొలగించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అడుగు ముందుకేసి ప్రిస్క్రిప్షన్ లేకుండానే కరోనా టెస్టులు నిర్వహించేందుకు ల్యాబులకు అనుమతినిచ్చింది. కరోనా టెస్టుల విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు డాక్టర్ ప్రిస్కిప్షన్ తొలగించమని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టుల విషయంలో ఉన్న అవరోధాన్ని తొలగిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమానితులకు డాక్టర్ ప్రిష్క్రిప్షన్తో పని లేకుండా కరోనా పరీక్షలు చేసేలా ఆదేశాలిచ్చింది. కరోనా లక్షణాలు లేకుండానే అసింప్టమేటిక్ కేసులు నమోదవుతున్న వేళ తమకు వైరస్ సోకిందేమోనన్న అనుమానం ఉన్న వారు టెస్టు చేయించుకునేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముంబైలోని ప్రతి పౌరుడికి పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో జూన్ 23న బీఎంసీ ‘మిషన్ యూనివర్సల్ టెస్టింగ్’ను ప్రారంభించినట్లు ప్రభుత్వం పేర్కొంటోంది. అలాగే పరీక్షల ఫలితాలను 24 గంటట్లో వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. మే నుంచి ఇప్పటి వరకు 3,59, 159 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇకపై టెస్టుల సంఖ్య భారీగా పెరగనుందని ప్రభుత్వం వెల్లడిస్తోంది.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 7,19,665 మంది కరోనా బారినపడ్డారు. అందులో 4,39,948 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,59,557 మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 2,11,987 మంది వైరస్ బారినపడ్డారు. ఇందులో ఒక్క ముంబైలోనే 85 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి, సింప్టమ్స్ ఉన్నవారికి, వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ అయిన హైరిస్క్ వ్యక్తులకు మాత్రమే పరీక్షలు చేస్తున్నాయి అన్ని ప్రభుత్వాలు. అయితే ఇటీవలే భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) కరోనా టెస్టుల విషయంలో కొత్త మార్గదర్శకాల తాజా గైడ్లైన్స్తో కరోనా టెస్టులు దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. ఈ కారణంగా కేసుల సంఖ్య గణనీయంగా పెరగనుంది.