కరోనా దెబ్బకు తెలుగు ప్రింట్ మీడియా చేతులెత్తేసింది. ఇలాంట పరిస్థితులు పత్రికలు నడపటం అసాధ్యమనే నిర్ణయానికి యాజమాన్యాలు వచ్చినట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు అన్ని దినపత్రికల పంపిణీ ని నిలిపి వేస్తున్నట్టు హాకర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు పత్రికల ఏజెంట్లకు పేపర్ సరఫరా నిలిపివేయాలని కోరుతూ అసోసియేషన్ వినతిపత్రం అందజేసింది. ఇప్పటికే ఆంధ్రభూమి దిన పత్రిక ఈ నెల 31వతేది వరకు కార్యాలయానికి సెలవు ప్రకటించింది. ఇదే బాటలో మరికొన్ని చిన్న పత్రికలు కూడా ఉన్నాయి.
అయితే ప్రధాన పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి స్టాండ్ ఎంటి అన్నది ఇంకా స్పష్టంగా తెలియరావడం లేదు. అయితే ఇందులో ఈనాడు మినహా మూడు సంస్థలు కూడా తాత్కాలిక మూసివేతకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. హాకర్స్ అసోసియేషన్ నిర్ణయానికి ఈనాడు లోబడి ఉంటుందా..లేక స్వతంత్రంగా ఉంటుందా అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మూసివేత బెటరన్న చర్చ పత్రికా సిబ్బంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆంగ్ల దినపత్రికలు హోమ్ టూ వర్క్ పద్దతిలో పని చేయాలని తమ సిబ్బందిని ఆదేశించాయి .
హాకర్స్ అసోసియేషన్ నిర్ణయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. గతంలో వార్త విశేషాలు తెలుసుకునేందుకు ప్రజలు కేవలం పత్రికలపైనే ఆధారపడేవారు . కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది . ఎలక్ట్రానిక్ మీడియా తో పాటు సోషల్ మీడియా విస్తృతి పెరిగింది . దాంతో వార్త విశేషాలు ఎప్పటికప్పుడు ప్రజలు తెలుసుకునే వెసులుబాటు లభించింది. ఇదిలా ఉండగా ఇక ఆఫీస్ కే వచ్చి పని చేయాలన్న వితండ వాదాన్ని పత్రికల యాజమాన్యాలు కూడా వీడనాడితే మంచిదని పలువురు జర్నలిస్టులు ఇప్పుడు సూచిస్తున్నారు. వర్క్ ఫ్రం హోంకు అనుమతిస్తే అందరికి సౌలభ్యం ఉండేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.