పూర్వం ఏం తిన్నా అరాయించుకునే శక్తి శరీరంలో ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఏ ఆహారం తీసుకోవాలన్నా భయమేస్తుందని చెప్పే వారి సంఖ్య అధికంగా ఉంది. నేడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యల్లో ఎసిడిటి ఒకటి. దీనికి ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహార పదార్థాలు. వీటివల్లనే రోజురోజుకు ఎసిడిటీ సమస్య ఎక్కువవుతుంది. ఏదైనా ఆహారం తీసుకోగానే తేన్పులు, చిరాకు, గుండెలో మంట వంటివి వస్తే.. ఈ పరిస్థితినే అసిడిటీ అంటారు.
అయితే ఎసిడిటీ అనేది జబ్బు కాదు. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోతే కడుపులో మంట అన్పిస్తుంది. ఎసిడిటికి తగు చికిత్స చేయకుండా ఏ మాత్ర పడితే అది వేసుకుంటే కొంత కాలానికి శరీరంలో రక్తహీనతకు గురవుతారు. అందుకని ఏ మాత్రం ఎసిడిటిని నిర్లక్ష్యం చేయరాదు. తగిన జాగ్రత్తలు మరియు కొన్ని చిట్కాలు పాటిస్తే ఎసిడిటి నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- యాలకులు ఎసిడిటిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీనిలోని ఔషధ గుణాలు వాత, పిత్త, కఫ, సంబంధిత రుగ్మతలను తగ్గిస్తుంది. ఎసిడిటి వచ్చినప్పుడు రెండు యాలకులను నమిలి మింగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఎప్పుడైతే ఎసిడిటి సమస్య మొదలవుతుందో అప్పుడు బాగా పండిన అరటి పండును తినాలి. అరటి పండులోని అధిక పొటాషియం వలన శరీరంలో పిహెచ్ స్థాయి పెరిగి ఎసిడిటి తగ్గుతుంది.
- ఉదయాన్నే పరగడుపున తులసి ఆకులు నమలండి. ఈ ఆకులు పొట్టలో పెప్టిక్ యాసిడ్ ను ప్రభావితం చేసే ఎసిడిటిని తగ్గిస్తాయి. అంతేకాక జీర్ణశక్తిని కూడా ఉత్తేజపరుస్తాయి.
- ఉసిరికాయ కూడా ఎసిడిటిని దూరం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అందుకని ఉసిరి పొడిని రోజుకు ఒక సారి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- పుదీనా ఆకుల్ని తీసుకుని నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత తీసేవించాలి. ఇలా చేస్తే ఎసిడిటి వల్ల వచ్చే మంట, నొప్పి తగ్గుతాయి.
- అల్లం జీర్ణాశయాన్ని క్రమబద్ధీకరించడంలో చక్కగా పనిచేస్తుంది. అల్లం చిన్న ముక్క తీసుకుని నమిలి దాని రసాన్ని మింగితే ఎసిడిటి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ముఖ్యంగా ఆల్కహాల్, పొగ త్రాగుడు, గుట్కాలు లాంటి పదార్థాలను పూర్తిగా మానేయడం వల్ల ఎసిడిటి భారిన పడకుండా ఉంటాం.