ఈ గ్రామానికి చెందిన ఇరవై నాలుగు ఏళ్ల మహిళా కొద్ది రోజుల క్రితం తీవ్రమైన జ్వరానికి గురైంది. శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ప్రాణం దక్కలేదు. ఆ తర్వాత వరుసగా మరో ఐదుగురు మరణించారు. ఆ గ్రామానికే చెందిన మరో ఇరవై మందికి పైగా ఇప్పుడు తీవ్ర జ్వరాలతో శ్రీకాకుళంలోని రిమ్స్ లో వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అజీమ్ ఖాన్ పేట గ్రామంలో పారిశుధ్యం తీవ్రంగా లోపించింది. ఊరి మధ్యలో చెత్తా చెదారం చేరి అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ దోమల కారణంగానే తమకు విష జ్వరాలు వస్తున్నాయని ఆరుగురి మరణాలకూ ఇదే కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు.
అజీమ్ ఖాన్ పేట గ్రామంలో రోజురోజుకి జ్వర పీడితులు పెరుగుతూండడం వరుస మరణాలతో గ్రామ భయాందోళనలో మునిగిపోవడంతో సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ తమ సిబ్బందిని పంపించింది. ఓ వారం రోజుల క్రితం వైద్య శిబిరాలని కూడా ఏర్పాటు చేశారు. డ్రెయిన్ లు నిండి పోయి చెత్తా చెదారంతో తీవ్ర దుర్గంధం పూరితమైన వాతావరణ కారణంగానే అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని ఉన్నతాధికారులకు సమాచారమందించారు. జ్వరంతో బాధపడే గ్రామస్తులు రిమ్స్ కు తరలించారు. అయితే గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న సమయంలో కూడా మరణాలు సంభవించాయి. దీంతో గ్రామంలోని పరిస్థితిని డీఎంఅండ్ హెచ్ వో చెంచయ్య స్వయంగా పర్యవేక్షించారు. ఇళ్ల మధ్య చేత్తతో పాటు వ్యర్థాలతో దుర్గంధ భరితమైన వాతావరణం ఉండటం వల్ల గ్రామంలో వ్యాధులు వస్తున్నాయన్నారు.
అయితే వైద్య శాఖ సిబ్బంది జ్వరాలతో ఇక్కడ సమస్య అని చెబుతూంటే గ్రామస్తులు మరో కోణం వినిపిస్తున్నారు. అజంఖాన్ పేట గ్రామంలో మృత్యు వాత పడిన వారిద్దరూ విషజ్వరాలతో చనిపోయిన వారు కాదంటున్నారు. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే జ్వరంతో బాధపడుతూ మృత్యు వాత పడ్డారని మిగిలిన నలుగురు వేర్వేరు కారణాలతో చనిపోయారని చెప్తున్నారు. దీంతో గ్రామస్తులు విషజ్వరాల భయం కంటే మూఢనమ్మకాల వల్ల వచ్చిన భయం కొండలా పెరిగిపోయింది. ఏదో కీడు జరిగిందని దాని వల్ల ఈ అనారోగ్య మరణాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు కొందరు గట్టిగానే నమ్ముతున్నారు. అజీమ్ ఖాన్ పేటలో ఈ నెల మొదటి వారంలో గ్రామదేవతకు వారాల పండగ నిర్వహించారు. వారాల పండుగ పూర్తయిన తర్వాత ఒక్కసారిగా అనారోగ్య పరిస్థితులు గ్రామంలో ఏర్పడ్డాయి. గ్రామదేవత కోపమొచ్చిందని అందుకే జ్వరాలొచ్చి అకాల మరణాలు సంభవిస్తున్నాయంటూ లేనిపోని వాదనలు ప్రచారంలోకి తెచ్చారు. వైద్య శిబిరాల ద్వారా ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ గ్రామంలో ప్రజలు భయాందోళనలు, మూఢనమ్మకాలు వదలటంలేదు. పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కి వివరిస్తున్నామంటున్నారు వైద్య ఆరోగ్య శాఖాధికారులు. సాధ్యమైనంత త్వరగా పంచాయతీ అధికారులతో మాట్లాడి అజీమ్ ఖాన్ పేట గ్రామంలో డ్రైనేజీ సదుపాయం ఏర్పాటు చేయిస్తామంటున్నారు. పారిశుధ్య లోపాల ఇలాగే ఉంటే రోగాలు అదుపు అవ్వడం సాధ్యం కాదని తేల్చేస్తున్నారు.