మహిళలు గర్భాధారణ కాలంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. గర్భం ధరించిన స్త్రీలు ఆరంభం నుంచి బిడ్డ పుట్టే వరకు చక్కని పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులే కాదు, మన పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకనే వారు నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాల్సి ఉంటుంది. అయితే గర్భిణీలు తేనె తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. తేనె అనేక రోగాలను నియంత్రించే తీపి ఔషదం. తేనె అన్ని వయసుల వారికి ఇష్టమైనది. తేనెటీగలు పువ్వులనుండి సేకరించే తియ్యటి ద్రవ పదార్థాన్నే తేనె అంటారు.
స్వచ్ఛమైన తేనె ఎన్నటికి చెడిపోదు, ఎందుకంటే పంచదార కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ మితంగా తేనెను సేవిస్తే, శరీరంలో రోగనిరోధక శక్తి రెట్టింపు అవుతుంది. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా తేనె సేవించడం ద్వారా అలెర్జీలకు దూరంగా ఉంటారు. ఉదయాన్నే, ఒక టేబుల్ స్పూన్ తేనెను గోరువెచ్చని నీటితో కలిపి సేవించడం లేదా మీ టీలో ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించి సేవిస్తే.. గర్భం ప్రారంభంలో సంభవించే అత్యంత సాధారణ అలసట మరియు అనారోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి.
శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెలో ఔషధగుణాలున్న నూనెలు, ఫ్లేవోనాయిడ్లు, టెర్పీన్లు, పాలీఫినాల్లు ఉన్నాయి. ఇవి అనేక రకాల అల్సర్లను తగ్గిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు- క్యాన్సర్, హృద్రోగాల్ని అడ్డుకుంటాయి. గర్భిణీలు తేనె తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో అజీర్ణం, పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి. సహజంగా లభించే తేనె గర్భిణీ స్త్రీల ప్రాధమిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.