శరీరానికి ఆహారమే ఆలంబన. చక్కని ఆరోగ్యం కోసం తగినంత పోషకాహారం ఎంత ముఖ్యమో దాన్ని ఒక క్రమపద్దతిలో తీసుకోవటమూ అంతే ముఖ్యం. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలతో నేటి తరుణంలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కారణాలు ఆహార మార్పులతో పాటు ఆహార జాగ్రత్తలు తీసుకోకపోవడం. వాస్తవానికి ఆహారం తిన్నాక కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలమంది ఫంక్షన్ లకు లేదా పార్టీలకు వెళ్లిన ఆహారం కొంచెం ఎక్కువగా తీసుకుంటారు. ఇక పసందైనా విందు ఆరగించాక చల్లటి ఐస్క్రీమ్ తినేవారు ఉన్నారు.
అయితే భోజనం చేసిన వెంటనే ఐస్క్రీమ్ తినవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న వెంటనే ఐస్క్రీమ్ తినడం వల్ల జీర్ణాగ్ని చల్లారిపోయి జీర్ణక్రియ దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. పండ్లు తినడం.. పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. కాదనం కానీ అన్నం తినగానే పండ్లు తింటే జీర్ణాశయంలోకి చేరుకున్న పదార్థాలు పులిసిపోయే ప్రమాదం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అదే విధంగా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. తినగానే టీ తాగుతుంటారు. తినగానే టీ తాగితే కడుపులో యాసిడ్స్ విడుదలై ఆహారం జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు అసలు తాగకూడదు. ఎందుకుంటే భోజనం తిన్న వెంటనే చల్లనినీరు తాగితే ఆహారంలోని కొవ్వులు గడ్డకట్టిపోతాయి. దీంతో జీర్ణాశయం అవసరానికి మించి శ్రమించాల్సి ఉంటుంది.