ఇంట్లో పెంచుకొనే కోడిని కోయాలంటేనే చాలామంది సందేహిస్తారు.  కానీ, ఆమె ఏకంగా తన పెంపుడు గుర్రాన్నే కోసుకుని తినేసింది. పైగా, టేస్ట్ చాలా బాగుందని, తన జీవితంలో ఇంత మంచి మాంసం ఎప్పుడూ తినలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. దీంతో దాన్ని తినేందుకు నీకు మనసెలా వచ్చిందని ఆమెను నెటిజనులు తిట్టి పోస్తున్నారు. కొందరు హితబోధ చేశారు. ‘‘నీ ప్రాణ స్నేహితుడు చనిపోతే ఇలాగే కోసుకుని కూర వండేసుకుంటావా?’’ అని కొందరు ప్రశ్నించారు.‘‘ఎమోషనల్‌గా ఎంతో దగ్గరయ్యే ఆ పెంపుడు గుర్రాన్ని తినడానికి నీకు మనసు ఎలా వచ్చింది’’ అని కొందరు, ‘‘నీ బంధువులను కూడా ఇలాగే వండుకుని తినేయి’’ అని మరికొందరు కామెంట్లు చేశారు.

నార్వేకు చెందిన 18 ఏళ్ల పియా ఓల్డెన్‌కు గుర్రపు స్వారీ చేయడమంటే చాలా ఇష్టం. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు ఓ గుర్రాన్ని కానుకగా ఇచ్చారు. బాల్యం నుంచి దానితో ఎంతో సన్నిహితంగా ఉంటూ పియా స్వారీ నేర్చుకుంది. అయితే అనారోగ్య కారణంతో ఆ గుర్రం 2018 నుంచి పరుగు ఆపేసి ఇంటికే పరిమితమైంది.ఆ గుర్రం ఇటీవల చనిపోయింది. దీంతో పియా, ఆమె తల్లిదండ్రులు దానికి అంత్యక్రియలు చేయకుండా దాన్ని ముక్కలుగా చేసి కొన్ని భాగాలు ఫ్రిజ్‌లో దాచిపెట్టారు.

 కొన్ని భాగాలను వండుకుని తినేశారు. అదేదో ఘనకార్యం చేసినట్లుగా పియా ఫేస్‌బుక్‌లో ఆ గుర్రం వంటకాల ఫొటోను పోస్టు చేసింది. ‘‘నాకు ఎప్పుడైనా గుర్రం మాంసం తినాలని అనిపిస్తే.. అది నా సొంతం గుర్రం మాంసమై ఉండాలి’’ అని పేర్కొంది. పైగా దాన్ని ఎలా వండాలో కూడా వివరిస్తూ.....   మిర్చి, మామిడి కాయ ముక్కలతో అలంకరించిన గుర్రం మాంసం ఫొటోలను కూడా ఆమె పోస్టు చేసింది.
 ఈ పోస్టు చూసిన జంతు ప్రేమికులు.. ‘‘నువ్వు బయట కనిపిస్తే చంపేస్తాం’’ అంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. 


దీంతో పియా ఆ పోస్టును తన పేజీ నుంచి డిలీట్ చేసింది. కానీ, ఆ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. తాను చేసిన పనిని పియా సమర్దించుకుంది. గుర్రం మాంసాన్ని తినాలనే ఆశతో ఈ పని చేయాలేదని స్పష్టం చేసింది. తన గుర్రాన్ని మట్టిలో కప్పెట్టి, కుళ్ల బెట్టి, పురుగులకు ఆహారంగా ఇవ్వడం తనకు ఇష్టం లేదని తెలిపింది. తన గుర్రాన్ని వండుకుని తినడం ద్వారా గొప్ప గౌరవాన్ని ఇచ్చినట్లుగా భావిస్తున్నానని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: