ప్రస్తుత సమాజం ఫలితం లేనిదే సహాయం చేయని స్థితిలో ఉంది. డబ్బు, పేరు కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారిని చూస్తుంటాం. అయితే తక్కువలో తక్కువ మంది.. మంచి మనసుతో ప్రాణాలు పణంగా పెడతారు. ఈ జాబితాలోకే చెందిన ఓ టీచర్ తన ప్రాణాలను పణంగా పెట్టి విద్యార్థులకు పాఠాలు చెబుతుంది. మరి వివరాల్లోకి వెళ్తే.. బినోదినీ సామల్ అనే టీచర్ ఒడిసాలోని ఢెంకనాల్ జిల్లా, హిందోల్ బ్లాక్లోని జరిపాల్ గ్రామంలోలో నివసిస్తుంది. ఆ గ్రామానికి పక్కనే మూడు కిలోమీటర్ల దూరంలో రతియాపల్ గ్రామం ఉంది. అక్కడ పాఠశాలలో ఆమె కాంట్రాక్ట్ టీచర్.
అయితే ఆ ఊరు నుంచి ఈ ఊరుకి ఆమె బస్సులోనో ,బైక్ లోనో వెళ్ళడం కాదు. ఆ రెండు గ్రామాల మధ్యన ఉన్న సపురా నదిని ఈదుకుంటూ వెళ్లి మరి పాఠలు చెప్పాలి. ఉదయం, సాయంత్రం రోజూ రెండు సార్లు ఆ గట్టుకు ఈ గట్టుకు ఈదితేనే అక్కడ పిల్లలు నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు. వర్షాకాలంలో నది ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అయితే సామల్ కొన్ని సార్లు వరద ఉధృతికి కొట్టుకుపోయినా ఏదో విధంగా ప్రాణాలు దక్కించుకున్నారు. దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. అయితే ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా ఆమె ఒక్క రోజు కూడా సెలవు పెట్టేది కాదు.
ఇంత కష్టపడుతున్నా ఆమె జీతం కేవలం 7 వేలు. ప్రస్తుతం ఆమె నది ఈదుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ ఆ ఊరుకు వంతెన కట్టిస్తామంటున్నారు. తన వల్ల ఆ ఊరుకు బ్రిడ్జి అయినా వస్తోందని ఆమె సంతోషిస్తుంది. కేవలం 53 మంది విద్యార్థులు ఉన్న పాఠశాల అది. తన ప్రాణాలను లెక్కచేయకుండా ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె పని చేస్తుంటే నిజంగా హాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.