మొదటి అయిదేళ్లు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరక ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడుగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేమిటో తెలుసుకుందాం...
ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతి పదినిమిషాలకూ వారి దృష్టి వేరే వాటిమీదికి మళ్లిపోతుంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాల లోపు అన్నం తినిపించాలి.ఆకలేసినప్పుడే పిల్లలకు అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు.
తిండి విషయంలో పిల్లల్ని వారి స్నేహితులతో పోల్చవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల స్నేహితులు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. అలా చేస్తే ఫుడ్కి సంబంధించి పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది.
అన్నం తింటే నీకు చాక్లెట్ పెడతాను. బిస్కెట్ ఇస్తాను అని అమ్మలు పిల్లల్ని ఆశపెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు.ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వారికి ఇష్టం, ఎలాంటివి ఇష్టం లేదు తెలుసుకుని తదనుగుణంగా మెనూ టైమ్టేబుల్ తయారుచేసి పిల్లలకు పెట్టాలి.పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తినడానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార లోపం సమస్య పోయి ఆకలి వేయడం, తిండి పట్ల ఆసక్తి రెండూ పెరుగుతాయి.
తల్లిదండ్రులు పిల్లలు తినే వేళల పట్ల శ్రద్ధ వహించాలి. టైమ్కు అనుగుణంగా ఆహారం వారికి పెట్టాలి. అన్నం తినే వేళలు సరిగ్గా పాటిస్తే పిల్లలు ఎప్పుడూ హుషారుగా, ఎనర్జిటిక్గా ఉంటారు.ఒకేసారి పిల్లలకు ఎక్కువ అన్నం పెట్టేయకండి. అలా పెడితే వారి కడుపు అరాయించుకోలేదు. పిల్లవాని బొజ్జలో ఒక దఫా 250ఎంఎల్ కన్నా మించి ఎక్కువ ఆహారం పోదు.
పోషకపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాన్ని పిల్లలకు పెట్టాలి. ఇలా చేస్తే పోషకాహార లోపం రాదు. చిక్కి, డ్రైఫ్రూట్స్, మిల్క్షేక్స్, నట్ హల్వా, నువ్వుల లడ్డు, పీనట్స్ చల్లిన, వెన్న పూసిన చపాతీలు, ఎగ్ ఆమ్ల్లెట్ కలిపిన చపాతీలు, దోసె వంటివి ఈ వయసు పిల్లలకు పెట్టాలి.పిల్లలకు అన్నం కలిపి పెట్టొద్దు. వారికి వారే ఆహారం కలుపుకుని తినేట్టు అలవాటు చేయాలి.తిండి ప్రాధాన్యత పిల్లలకు అర్థమయ్యేలా తెలియజెప్పాలి.
పిల్లలకు ఇష్టమైన చాక్లెట్లు, పిజ్జాలాంటివి తినొద్దని కట్టడి చేయకండి. అదే సమయంలో చాక్లెట్తోపాటు ఒక పండు కూడా పిల్లలచేత తినిపిస్తే వారి ఆరోగ్యానికి చాలా మంచిది.కుటుంబసభ్యులతో కలిసి అన్నం తినడాన్ని పిల్లలకు నుంచే అలవాటు చేయాలి. నలుగురితో కూర్చుని తినడం వల్ల పిల్లలు బాగా తింటారు కూడా.