చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏది అవసరమో అది కాకుండా అనవసరమైన విషయాలను ఇస్తున్నారు. దీని వలన ఇటు పిల్లవాడి భవిష్యత్ తో పాటు తల్లిదండ్రుల భవిష్యత్ కూడా ఇబ్బందులో పడుతోంది.ఎంతసేపూ చదువుల పరుగు పోటీల తమ పిల్లలను ముందుంచాలనే ఆత్రం తప్పితే ఇప్పటి తల్లిదండ్రులు తాము ఎక్కడ పొరపాటు చేస్తున్నామో గుర్తించలేకపోతున్నారు. ఇల్లే ప్రపంచం,లేదంటే హాస్టల్ ఉండడం..
ఇవే పిల్లల ప్రపంచం. పిల్లల ఎదుగుదల ఎప్పుడూ ప్రకృతితో మమేకమై ఉండాలి. సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు, సాటి జీవులు, బతుకు పోరాటం ఇవన్నీ పిల్లలు చూసి, అనుభవం చెంది మాత్రమే నేర్చుకోగలుగుతారు. పిల్లలకు అడవిని చూపించాలని , అక్కడ కుదరకపోయినా జూలో జంతువులను చూపించాలని నిపుణులు చెపుతున్నారు. సాటి జీవుల పట్ల ప్రేమ, ఆహారాన్ని సంపాదించుకునేందుకు, గూడును ఏర్పాటు చేసుకునేందుకు అవి పడే తపన అర్ధమవుతాయని అంటున్నారు.
కానీ అలా ప్రకృతిని చూసే అవకాశం ఎంత మంది పిల్లలకు ఉంది. కాంక్రీట్ అరణ్యాల్లో పెరగుతున్న వారి అరణ్యాల గూర్చి ఏం తెలుస్తుంది. అడవి, అక్కడ పచ్చదనం, జంతువులు ఇలా పిల్లలకు అన్ని విషయాలను తెలియజేయాల్సిన తల్లిదండ్రులకు ఎంత సేపూ చదువు చదువు అంటూ పిల్లలను రుద్దడమే సరిపోతోంది. ఇక పిల్లవాడు ఎప్పుడు మానసికంగా ఎదుగుతాడు? ఎలాంటి పరిణతి సాధిస్తాడు. కచ్చితంగా సాధించలేడు.
మెల్లగా తన సున్నితత్వాన్ని కోల్పోయి పెద్దయ్యాక తన తల్లిదండ్రులతో అలాగే ప్రవర్తిస్తాడు.మనం ఎలా అయితే పిల్లల చదువు అని హాస్టల్ లో పడేస్తున్నామో పిల్లలు కూడా అంతే తల్లితండ్రులు ముసలివాళ్ళు అయ్యాక వృద్ధాశ్రమంలో పడేస్తారు. పిల్లలకు తల్లితండ్రులుతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది.ఎంతసేపు ఒక గదిలో పడేసి చదువు అంటున్నాము. అందుకె తమను తమ పిల్లలు ఓల్డేజ్ హోమ్ లలో పడేస్తున్నారని బాధపడే తల్లిదండ్రులు తమ పెంపకంపై ఒకసారి సమీక్ష చేసుకోవాలి.