కరోనా వైరస్ లేదా కోవిడ్-19.. ప్రపంచదేశాల ప్రజలు ఈ పేరు వింటేనే భయపడిపోతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్.. ప్రస్తుతం దేశదేశాలు వ్యాప్తిచెందింది. ఇక పేద.. ధనిక, చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరికీ ఈ ప్రాణాంతకర మహమ్మారి ముచ్చెమటలు పట్టిస్తుంది. అంతేకాదు రోజురోజుకు ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ పోతోంది తప్ప తగ్గడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి పట్ల ఆందోళన మరింత ఎక్కువ అవుతోంది. ఇక ఈ కరోనా భూతం పిల్లలకు కూడా సోకుతుంది. వాస్తవానికి ఆటలు, చదువు తప్ప ఈ ప్రపంచంతో ఇంకేమీ సంబంధం లేదన్నట్లుగా జీవించే పిల్లలు.. ఏం చేయొద్దని చెబుతామో అది చేయడం వాళ్లకు అలవాటు.
మరి కరోనా రాకుండా భౌతిక దూరం పాటించడం, మాస్కువేసుకోవడం వంటివి వారు రోజంతా పాటిస్తూ అప్రమత్తంగా ఉంటారనుకోవడం అసాధ్యం. అందుకే ఇలాంటి విపత్కర సమయంలో వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈ క్రమంలోనే పిల్లలు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా వారి చేతులను ఎక్కువ సార్లు సబ్బు, లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించి శుభ్రం చేయండి. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పిల్లలను దూరంగా ఉంచండి.
అదేవిధంగా, మీ పిల్లల్ని ఇతరులతో షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి దూరంగా ఉంచండి. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఇది చాలా కీలకం. ఇదేమంత పెద్ద విషయం కాదని అనుకోవచ్చు. కానీ, పిల్లల్లో సామాజిక దూరంపై అవగాహన లేకపోతే వారికి, వాళ్లతో పాటు మనకు వైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది. అలాగే మీ పిల్లలను కాపాడుకోవడానికి, కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇల్లు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా పిల్లలు వాడే బొమ్మలు, ఫోన్లు, ట్యాబ్లెట్లు ఇలా అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.. ఇక దగ్గు వస్తున్న టైమ్లో ఖచ్చితంగా టిష్యూని కానీ, మాస్క్ ను అయినా వాడమని చెప్పండి.