సెల్ ఫోన్లు వాడకంలో జపాన్ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాల్సిందే... రైళ్లలో, బస్సుల్లో, కార్లలో,రోడ్ మీద నడుస్తూ పోతున్నప్పుడు కూడా వాటిని వాడుతుంటాం. ఇలాంటి పద్దతికి జపాన్ ప్రజలు పూర్తి విరుద్ధం.
వారి జేబులో సెల్ ఫోన్ ఉన్నప్పటికీ పబ్లిక్లో ఉన్నపుడు ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే, సెల్ఫోన్లలో మాట్లాడుతుంటే ఇతరులకు, అంటే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందనే, అలా చేస్తారట. అంతేకాకుండా వారు తడిచిన గొడుగులు పట్టుకొని బస్సుల్లోకిగానీ, రైళ్లలోకిగానీ ఎక్కరు.వాటి కోసం స్టేషన్లో ఏర్పాటుచేసిన 'ఓపెన్ బాస్కెట్'లో పడేసి వెళతారు. తిరుగు ప్రయాణంలో తీసుకుంటారు. దీనికి కారణం ఆ తడసిన గొడుగువల్ల రద్దీగా ఉండే రైళ్లలో తోటి ప్రయాణికుల బట్టలు తడుస్తాయన్న ఉద్దేశమట.
ఇలాంటి మనస్తత్వం ఎందుకు ? మానవుల్లో ఇలాంటి ప్రవర్తన పై మానసిక శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. మనిషి బ్రెయిన్లో ఉండే 'మిర్రర్ న్యూరాన్స్' స్పందన వల్ల ఇలాంటి ప్రవర్తన అబ్బుతుందని, బ్రెయిన్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్' పరిశోధకులు తేల్చి చెప్పారు.
'మిర్రరింగ్ బిహేవియర్' అంటే మన వల్ల ఇతరులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అన్న కోణంలో మనం ఆలోచించినప్పుడు, తోటి ప్రయాణికులను చూస్తూ ఆ ఇబ్బందులు ఏమిటో మనం గుర్తించినప్పుడు మెదడులోని కొన్ని న్యూరాన్లలో స్పందన కలుగుతుందని,తద్వారా అలా ప్రవర్తించరాదనే ఆలోచన వస్తోందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలోకెల్లా జపాన్ ప్రజల్లోనే ఇలాంటి ప్రవర్తన ఎక్కువుగా ఉందట.
సమాజంలో కలిసికట్టుగా జీవించాలనే 'కమ్యూనిటీ ఫీలింగ్' వారిలో ఉండడం ఒకటైతే, సమాజంలో మమేకమవడం ద్వారా వారిలో 'తోటివారికి మనుషులకు ఇబ్బంది కల్గించరాదు' అనే ఆలోచన పెరుగుతోందట.