దీపావళి నాడు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే హరిత టపాసుల్ని(గ్రీన్ క్రాకర్స్) మాత్రమే వినియోగించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ ఈ హరిత టపాసుల ఫార్ములాను తయారు చేసింది.చూడ్డానికి ఇవి మామూలు టపాసులలానే ఉంటాయి. అలానే పేలుతాయి. కానీ, వీటి నుంచి పొగ, శబ్దం తక్కువగా వెలువడతాయి.

సాధారణ టపాసులు ఎక్కువ నైట్రోజెన్, సల్ఫర్ వాయువులను విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే హరిత టపాసులు 40-50శాతం తక్కువ వాయువులను విడుదల చేస్తాయి

.
ఈ హరిత టపాసుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలను వినియోగిస్తారు. ఈ టపాసుల్లో చాలా రకాలుంటాయి.
1. నీరు విడుదల చేసే టపాసులు: ఇవి పేలితే నీటి బుడగలు విడుదలవుతాయి. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్లు అని పిలుస్తారు.
2. తక్కువ సల్ఫర్, నైట్రోజెన్ విడుదల చేసే టపాసులు: కాలుష్యాన్ని తగ్గించే ఆక్సిడైజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి.
3. అల్యుమినియం వినియోగం తక్కువ: ఈ హరిత టపాసుల తయారీకి 50-60శాతం తక్కువ అల్యుమినియం వినియోగిస్తారు. వీటిని SAFAL (సేఫ్ మినిమల్ అల్యుమినియం క్రాకర్స్) అని పిలుస్తారు.
4. ఆరోమా టపాసులు: ఇవి పేలితే శబ్దంతో పాటు సువాసనలు కూడా వస్తాయి.


కానీ, భారతీయ మార్కెట్‌లో హరిత టపాసులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం పరీక్షించాకే వీటికి అనుమతిస్తుంది. అందుకే అవి విస్తరించడానికి ఇంకాస్త సమయం పడుతుంది.ప్రపంచంలో మరే దేశంలోనూ ఈ హరిత టపాసుల్ని వినియోగించరు. ఈ ఆలోచన భారత్‌లోనే పుట్టిందని, ఇవి వినియోగంలోకి వస్తే ప్రపంచంలో ఓ కొత్త మార్పునకు భారత్ శ్రీకారం చుడుతుందని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ చీఫ్ సైంటిస్ట్ సాధన చెప్పారు.
‘ఈ టపాసుల విషయంలో మా పరిశోధన పూర్తయింది. అనుమతి కోసం దరఖాస్తు చేశాం’ అని సాధన వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: