ప్రస్తుత తరుణంలో మనం పాలిష్ చేసిన బియ్యాన్నే ఎక్కువగా తింటున్నాం. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అందుకే అవి అంత మంచిది కాదు. అయితే మన పూర్వీకులు దంపుడు బియ్యాన్నే తినేవారు. అందుకని వారికి అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వచ్చేవి. పాలిష్ చేసిన బియ్యాన్ని తింటుండడం వల్ల అనేక అనారోగ్యాలకు గురి కావల్సి వస్తున్నది.
అయితే వాటికి బదులుగా బ్రౌన్ రైస్ (ముడి బియ్యం) తిని చూడండి. ముడి బియ్యం తినడం వల్ల అనేక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. ముడి బియ్యంలో పీచు సమృద్ధిగా ఉంటుంది. ఇది పేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అదే విధంగా ముడిబియ్యంలో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం
డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది.
ముడి బియ్యంలో మెగ్నిషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా ముడి బియ్యం పనికొస్తుంది. ఇందులో ఉండే పాస్ఫరస్ మన శరీరంలో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. వీటితో పాటు ముడి బియ్యపు ఊకనుండి లభ్యమయ్యే
నూనె, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది.