సాధారణంగా ఏ తలనొప్పో, ఒళ్లునొప్పులో వచ్చాయంటే చాలు.. మెడికల్ షాప్కి వెళ్లి టాబ్లెట్లు తెచ్చుకుని వేసుకోవడం చాలామందికి ఉన్న అలవాటు. కొంతమంది మాత్రమే వైద్యుల సలహామేరకు మందు వేసుకుంటారు.పెయిన్ కిల్లర్స్ లేక బాధా నివారిణులను ఎక్కువ కాలం వాడితే అది మన బాధలకు, నొప్పులను తాత్కాలికంగా నివారించవచ్చు. కానీ వాటి వల్ల ఆ తరువాత కొన్ని అనారోగ్యాలు వచ్చి పడే ప్రమాదముంది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్లో ఉండే ‘ఓపియోయిడ్’ అనే ఔషధం వల్ల మరిన్ని తీవ్రమైన నొప్పులు తలెత్తే ప్రమాదముందట.
పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల నొప్పి తగ్గే అవకాశాల
కన్నా భవిష్యత్తులో వినికిడిలోపం కలిగే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. పెయిన్కిల్లర్స్ వాడితే వినికిడి శక్తి తగ్గే అవకాశం ఆరు శాతం ఉందని వీరి పరిశోధనల్లో తేలింది. అలాగే పెయిన్ కిల్లర్స్ను ఎడా పెడా వాడితే కాలేయం పనితీరుపై ప్రభావం పడుతుంది. వీటివల్ల గుండెపోటు, పక్షవాతం లాంటి జబ్బుల బారిన పడే అవకాశం 10 శాతం పెరుగుతుందని కూడా చెబుతున్నారు పరిశోధకులు.
కొంత మందికి సైలెంట్ అల్సర్ ఉంటుంది. అంటే అల్సర్ ఉన్న విషయం వాళ్లకి తెలియకపోవచ్చు. అలాంటివాళ్లు పెయిన్ కిల్లర్స్ పదే పదే వాడితే రక్తం వాంతులై,
బిపి పడిపోయి ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి రావచ్చు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే మూత్రపిండాలు ఫెయిలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే భరించలేని నొప్పి ఉన్నప్పుడు తప్ప పెయిన్ కిల్లర్లను సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమే ఉత్తమం.