ఇప్పుడున్నదంతా ఉరుకు పరుగుల ప్రపంచమే... కన్ను మూసి తెరిచే లోపు ప్రపంచం చాలా ముందుకు పరుగులు పెట్టేస్తోంది. సంపాదన కోసం గంటల కొద్దీ పని చేయక తప్పట్లేదు. డబ్బు ఎక్కువ వస్తుందనో.. ప్రమోషన్ కోసమో... లేదా ఈ పోటీ ప్రపంచంలో ఇతరుల కన్నా ముందు ఉండాలన్న తాపత్రయయో గాని ఈ ఒత్తిళ్లతో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ విషయాన్ని చైనాకు చెందిన సీసీటీవీ
మీడియా సంస్థ చేసిన సర్వేలో వెల్లడించారు.
చైనాలో అతిగా పని చేయడం వల్ల ఒక ఏడాది 6 లక్షల మందికి పైగా మరణించారట. గతంలో ఈ మరణాలు ఎక్కువుగా జపాన్లో ఉండేవి. ఇప్పుడు చైనాలో ఎక్కువ మంది పని ఒత్తిడితో చాలా తక్కువ కాలమే బతుకున్నారని తెలుస్తోంది. ఈ మరణాల్లో అత్యధిక శాతం మంది యువతే కావడం గమనార్హం. ఎక్కువ టైం పని చేసే వారిలో ఎక్కువుగా ఉద్యోగులు ఉంటున్నారు.
ఈ ఉద్యోగుల్లోనూ ఐటీ,
మీడియా, మెడికల్, అడ్వర్టైజ్మెంట్ రంగాలకు చెందిన వారేనట. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కెరీర్ వృద్ధి కోసం కనీసం ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అతిగా పని చేస్తుండటం వల్లే ఈ మరణాలు సంభవిస్తున్నాయని సీసీటీవీ వెల్లడించింది. ఇక పని వేళల సంగతి పక్కన పెట్టేస్తే.. ఇక ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లడం... ఇంటి నుంచి ఆఫీస్కు వెళ్లడం కూడా తీవ్రమైన ఒత్తిడితో ఉందోట.
పట్టణాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పని ఒత్తిడి.. కుటుంబం ద్వారా పెరిగే ఒత్తిడి వీరి మానసిక స్థితిని మరింత క్షీణింప చేస్తోందని సదరు
మీడియా సంస్థ రిపోర్టులో పేర్కొంది.