ముంబయికి చెందిన ఒక డ్రైవర్ తన ఆటోని ఎంతలా మార్చడంటే..ముంబయి ప్రజలంతా ఆ ఆటోకి పెద్ద ఫాన్స్ అయిపోయారు. నిన్న ఇంటర్నెట్ లో ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఈ ఆటోకి సంబంధించిన ఫొటోస్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఆ రోజు నుంచి ఈ ఆటోరిక్షా పిక్చర్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... ఆటో డ్రైవర్ పేరు సత్యవాన్ గీతే. అతను తన ఆటోలో అనేక రకాల సౌకర్యాలను అమర్చాడు. వాటిలో వాష్ బేసిన్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ పాయింట్స్, పచ్చని మొక్కలు, ఒక కంప్యూటర్ మానిటర్ స్క్రీన్.. ఇంకా ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఆ ఆటోరిక్షా వెనుక 'విమానంలో ప్రయాణించిన అనుభవం పొందండి' అని రాయించాడు సత్యవాన్.

డ్రైవర్ సత్యవాన్ మాట్లాడుతూ, "నా ఆటోలోని ప్రయాణికులు వారి ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, శుభ్రమైన నీటిని తాగొచ్చు, వాష్ బేసిన్ ఉంది. పెద్దవాళ్ళని 1 కిలోమీటర్ వరకు ఉచితంగా గమ్యాలకు చేరవేస్తా. ప్రజలకు మంచి సేవను అందిచడానికే నేను ఇలా చేస్తున్న." అని వివరించాడు.

ఇంట్లో ఉన్న అన్నీ సౌకర్యాలను తాను తన ఆటోలో అందిస్తున్నానని చెప్పుకొచ్చాడు సత్యవాన్. విశేషమేంటంటే మాజీ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ఆటో ఫోటోలని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి, " ఈ ఆటోలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ డ్రైవర్ చాలా తెలివైనవాడు" అంటూ పేర్కొంది.

దీంట్లో ప్రయాణించిన ప్రయాణికులు ఈ ఆటో గురించి తమ అభిప్రాయాలను ఇంటర్నెట్ ద్వారా తెలియజేస్తున్నారు.. 'ఈ ఆటోలో ప్రయాణించినప్పుడు మంచి అనుభవం వచ్చింది. ఇది చాలా సృజనాత్మకంగా ఉంది. ఈ ఆటో లో ప్రతిరోజు ప్రయాణించాలనుంది' అంటూ నెట్టింట కామెంట్లు హోరెత్తుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: