యువతీ యువకులు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇప్పటికీ పది శాతానికి మించడం లేదు భారతదేశంలో ,ఈ విషయంలో ఇదివరకు పెళ్లిళ్లు కుదుర్చే ఏజెన్సీలు, సంస్థలు ప్రధాన పాత్ర వహించగా, నేటి ఆధునిక టెలికామ్ కాలంలో డేటింగ్ యాప్లు, వెబ్సైట్లు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.
భారత్లో 90 శాతం పెళ్లిళ్లు పెద్దలు నిశ్చియించన ‘అరేంజ్డ్ మ్యారేజెస్’ లేదా ‘సెమీ అరెంజ్డ్ మ్యారేజెస్’ జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ అంటే ముఖ పరిచయం కూడా లేకుండా పెద్దలు, మధ్యవర్తులు కుదుర్చిన పెళ్లిళ్లు కాగా, మిత్రుల ద్వారానో, పెద్దల ద్వారానో పరిచయమై ఒకరికొకరు కొంత అర్థం చేసుకొనే పెళ్ళిళ్లను సెమీ అరేంజ్డ్ మ్యారేజెస్గా వ్యవహరిస్తున్నారు.
శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఏర్పాటయిన ‘దిల్ మిల్’ యాప్ భారత్, ఇతర దక్షిణాసియా దేశాలలో యమ స్పీడ్గా దూసుకుపోతోంది. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇప్పటికే ఈ యాప్ ద్వారా రెండు కోట్లకు పైగా పెళ్లిళ్లు జరిగాయట. రోజుకు కనీసం ఒక్క పెళ్లి చేయడం తమ విజయానికి ప్రధాన కారణమని ‘దిల్ మిల్’ వ్యవస్థాపకులు, సీఈవో కేజే దలివాల్ ఇటీవల ఓ మీడియాతో వ్యాఖ్యానించారు.నామ మాత్రపు పెట్టుబడితో మొదలైన ఈ యాప్ ఇప్పుడు భారతీయ కరెన్సీలో 357 కోట్ల రూపాయలకు చేరుకుంది. తమ యాప్ విజయానికి ‘డేటింగ్ డాట్ కామ్, డేట్మైఏజ్, లవింగ్ఏ, టుబిట్, అనస్థేసియా డేట్, చైనాలవ్...’ తదితర డేటింగ్ వెబ్సైట్లు ఎంతో కారణమని కూడా దలివాల్ పేర్కొన్నారు.
అమెరికా, కెనడాలతోపాటు బ్రిటన్, ఇతర యూరప్ దేశాల్లో నివసిస్తున్న దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ, యువకుల కోసమే ఈ ‘దిల్ మిల్’ యాప్ను అభివృద్ధి చేశారు. దక్షిణాసియా దేశాలకు చెందిన యువతీ యువకుల్లో 80 శాతం మంది దక్షిణాసియా దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడానికే ఇష్ట పడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకుపైగా భారతీయులు స్థిరపడ్డారని, ఇప్పుడు వారిని తమ యాప్ ప్రధానంగా ఆకర్షిస్తోందని దలివాల్ తెలిపారు. 2040 సంవత్సరం నాటికి ప్రతి పది మందిలో ఏడుగురు ఈ యాప్ ద్వారా కలసుకుంటారని దిల్ మిల్ అంచనా వేస్తోంది.