రోజూ పాలు తాగడం మంచిదని, పాలు తాగడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే బెల్లం కలిపిన పాలు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. బెల్లం… చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడతారు. దీంతో అనేక పిండి వంటలు చేసుకుంటారు. సాధారణ చక్కెర కన్నా బెల్లం తినడం వల్లే మనకు ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే… వేడి వేడి పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పాలు బెల్లం రెండూ మనకు ఆరోగ్యాన్ని కలిగించేవే.
నేటి తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్య రక్త హీనత. అనీమియా. దీని వల్ల శరీరంలో రక్తం సరిగ్గా ఉండదు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. పోషకాలు అందవు. అయితే బెల్లం కలిపిన పాలు తాగుతుంటే రక్త హీనత సమస్య ఇట్టే పోతుంది. రక్తం బాగా పడుతుంది. ప్రధానంగా మహిళలకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది. వేడి వేడి పాలలో బెల్లం కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. బెల్లం, పాలలో ఉండే పలు రకాల ఔషధ గుణాలు శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును తగ్గిస్తాయి. తద్వారా బరువు తగ్గుతారు.
పిల్లలకు బెల్లం పాలు ఇస్తే తక్షణ శక్తి వచ్చి, ఉత్సాహంగా ఉంటారు. రోజూ బెల్లం పాలు తాగడం వల్ల క్యాల్షియం పెరిగి ఎముకలు బలంగా మారతాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం కలిపిన వేడి పాలలో సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల అవి అనారోగ్యాలను కలిగించే వైరస్లు, బాక్టీరియాల భరతం పడతాయి. దీంతో పలు ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. పాలు, బెల్లం కలిపిన ద్రావణం మీ జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది.