టీ తాగే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది. ప్రతి రోజూ టీ తాగుతూ ఉంటాం. సాధారణంగా కేజీ టీ పొడి ధర మనకు కొనుగోలు చేసే స్థాయిలోనే ఉంటుంది. మహా అయితే ఎంత తోటనించి తాజాగా తీసుకు వచ్చినా వెయ్యి నుంచి 5 వేల వరకు ఉండొచ్చనుకుంటాము. కానీ.. ఇక్కడ ఒక కిలో టీ పొడి ధర మాత్రం ఏకంగా 40 వేల రూపాయలు పలికింది. మీరు విన్నది నిజమే. నేను చెబుతున్నది కాఫీ పొడి ధర కాదు. టీ పొడి ధరనే. మీలాగే ఆ ప్రదర్శన తిలకిస్తున్న సందర్శకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే. తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కున్నూరు ఉపాసి ఆడిటోరియంలో ప్రత్యేక తేయాకు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ‘ఏజ్ టి’ టీ పొడి కిలో రూ.40 వేలుగా ధర నిర్ణయించడం సందర్శకులను విస్మయానికి గురిచేసింది. దక్షిణ భారత టీ బోర్డు ఆధ్వర్యంలో కున్నూరు ఉపాసి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేయాకు ప్రదర్శనలో ఉత్పత్తిదారుల గ్రీన్ టీ, వైట్ టీ, ఎల్లో టీ, ఆర్థోడెక్స్ తదితర పలురకాల టీ పొడులు చోటుచేసుకున్నాయి. ఇందులో 'భూఏర్' ఏజ్' రకం టీ పొడుల ధరలు కళ్లు జిగేల్ మనిపించాయి.
ఎందుకంటే ఈ టీపొడి ధర 50 గ్రాములు రూ.2 వేలు అంటే కేజీ నలభై వేలు అన్నమాట. ఏమిటి దీని ప్రత్యేకత? ఎందుకంత ధర? అని సందర్శకులు ఆరాతీస్తే.. ప్రకృతి విధానంలో ఆక్సిజన్ అధికంగా వినియోగించి బాక్స్లలో ఒకటిన్నర ఏళ్లకు పైగా అతి జాగ్రత్తంగా పండించిన ఈ రెండు రకాలు ఆరోగ్యానికి శ్రేష్టమని, దీనిని చైనీయులు ఇష్టపడి సేవిస్తుంటారని ఆర్గానిక్ రైతు ప్రభురంజన్ పేర్కొన్నారు.