డిసెంబర్ 31కి సమయం దగ్గర పడినా కొద్దీ జనాల్లో న్యూ ఇయర్ వేడుకల జోష్ మొదలవుతోంది. సరిగ్గా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎక్కడా విన్న న్యూ ఇయర్ పార్టీల ఏర్పాటుకు సంబంధించిన ముచ్చట్లే వినబడుతుండటం గమనార్హం. న్యూ ఇయర్కు గ్రాండ్గా వెల్కం చెప్పేందుకు ప్రపంచం మొత్తం సిద్ధమైంది. పల్లె నుంచి పట్నం వరకు.. ఎవరినీ కదిలించిన అదే ముచ్చట. ఎవరెవరితో..ఎక్కడా..ఎలా..సెలబ్రేట్ చేసుకోవాలనే విషయాలపై చర్చించుకోవడం కనిపిస్తోంది. ఇక ఖర్చుకు సంబంధించిన లెక్కలు వేసుకుంటుండటం గమనార్హం.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రజానీకం విషయానికి వస్తే పెరిగిన మద్యం రేట్లతో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వారు కాస్త కంగారు కూడా పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మద్యం ధరలను విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా బీరుపై 20 పెంచేసింది. మందుపై కూడా రూ.20 బాదేసింది. ఈసారి న్యూ ఇయర్ పార్టీ ఖర్చు కాస్త మరింతగా పెరిగనుందన్న టెన్షన్ వారిలో ఉంది.
కార్పొరేట్, ఉన్నత వర్గాల ప్రజలు రిసార్టులు, ఆర్గనైజ్డ్ సంస్థలు నిర్వహించే వేడుకలకు హాజరయ్యేందుకు టికెట్లను బుక్ చేసుకుంటుండటం గమనార్హం. అయితే వీటి రేట్లు కూడా ప్రియంగా ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్లో అయితే పేరెన్నికగన్న సంస్థల టికెట్ల ఎంట్రీ ఫీజులు ఏకంగా రూ.5000 ల నుంచి 25000 వరకు ఉండటం విశేషం. ఫ్యామిలీ ప్యాకేజీగా మాత్రం కాస్త తక్కువకు అందజేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు టికెట్లను ఫ్రీ అందజేస్తున్నాయి.
ఇక కొన్ని హోటళ్లు కూడా ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తూ జనాలను ఆకర్షిస్తున్నాయి. ఇక సామాన్య జనం మాత్రం మిత్రులు, కుటుంబ సభ్యులతో నిర్వహించుకునేందుకు కేక్లను ముందస్తుగా ఆర్డర్ ఇవ్వడం..కావాల్సిన సామగ్రిని ముందే కొని పెట్టుకోవడం కనిపిస్తోంది. అయితే యూత్ మాత్రం స్నేహితులతో ప్రత్యేకంగా రూంల్లో మందు పార్టీలకు తలా ఇంతా అంటూ ఓన్ ప్రిపరేషన్లో పడటం విశేషం.