ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు సిధ్దమవుతంటే హైదరాబాద్ ఈ వేడుకలకు ఈ సారి మాత్రం దూరంగా ఉంటోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎక్కడా పార్టీల ఏర్పాట్లు లేవు. పాసులు, పర్మిషన్ల అంటూ ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ ఈసారి హైదరాబాద్ మొత్తం చాలా కట్టుదిట్టంగా చేశారు పోలీసులు. ఎవరిలోనూ ఆ జోష్ కనపడటంలేదు. ఏ ఈవెంట్ మేనేజర్లను టచ్ చేసినా నో రెస్పాన్స్. బార్కి వెళ్లినా, పబ్కి వెళ్లినా సందడి కనిపించడంలేదు. ఇంతకీ ఆ జోష్ తగ్గడానికి కారణాలేంటి? మరి.. పార్టీల మాటేంటి?
ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన 2019 మరికొద్ది గంటల్లో ముగియబోతోంది. మరెన్నో ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు, ఆలోచనలు, సరికొత్త కార్యాచరణలతో 2020 మన ముందుకు రాబోతోంది. న్యూ ఇయర్ను సాదరంగా ఆహ్వానించేందుకు ప్రపంచమంతా రెడీ అయింది. హైదరాబాద్లో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు.
గత ఏడాదితో పోల్చితే ఈసారి న్యూ ఇయర్ వేడుకల ఏర్పాట్లు సిటీలో అంతగా కనిపించడం లేదు. ఈవెంట్ మేనేజర్లు కూడా వాటి జోలికి పోవడం లేదు. ఒక పక్కన పోలీసుల నిఘా, మరో పక్కన డ్రంక్ అండ్ డ్రైవ్ లు, దీనికి తోడు భారీ బడ్జెట్. దీంతో పెట్టుబడిగా పెట్టిన డబ్బు కూడా వచ్చేలా కనపడక పోవడంతో పబ్స్, రిసార్ట్స్ యాజమాన్యాలు పార్టీల మాటే ఎత్తడంలేదు. దీంతో ఎక్కడా హడావిడి కనిపించడం లేదు.
ఓవైపు... సెలబ్రెటీల రెమ్యునరేషన్ చుక్కలనంటడం, మరోవైపు పోలీసుల ఆంక్షలు కూడా న్యూఇయర్ జోష్కి బ్రేకులు వేశాయి. ఈవెంట్ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు.. వాటిని ఎప్పటికప్పుడు వాచ్ చేసేలా ఐపీ నెంబర్లు పోలీసులకు ఇవ్వాలని, లిక్కర్ లిమిట్గా అందించాలని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, గచ్చిబౌలి లాంటి ఏరియాల్లో తప్ప ఇతరచోట్ల ఈవెంట్ల కోసం పెద్దగా పర్మిషన్లు కోరలేదు నిర్వాహకులు. అంతే కాక ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇలా పోలీసుల కట్టుదిట్టాలతో హైదరాబాద్ అంతా పోలీసుల ఆంక్షలతో మునిగిపోయింది.