తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సంక్రాంతి పండగ వచ్చిందంటే గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా ఆ సందడే వేరు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ మన సంస్కృతి వైభవాన్ని చాటి చెబుతుంది. ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నలు, ముంగిట గొబ్బెమ్మలు వంటి సాంప్రదాయ వేడుకలు దర్శనం ఇస్తాయి.
ముఖ్యంగా.. సంక్రాంతి సంబరాల్లో కన్నెపిల్లలు ఎక్కువగా సంబరం జరుపుకునేది గొబ్బెలతోనే. వాకిళ్లలో రంగవల్లులు అద్ది.. వాటి మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి. వాటిని పూలలో అలంకరించి.. శ్రీ కృష్ణుని చుట్టూ చేరి గోపెమ్మలు ఆడినట్లు.. ఆ గొబ్బెమ్మల చుట్టూ చేరి కన్నెపిల్లలు ఆడటం సంక్రాంతి సంప్రదాయం. అలాగే గొబ్బెమ్మ సాక్షాత్తూ గౌరీ స్వరూపం గా పురాణాలు చెబుతున్నాయి. శక్తిస్వరూపిణియైన కాత్యాయని కూడా గొబ్బెమ్మగా భావిస్తారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది.
నిజానికి చెప్పాలంటే.. సంక్రాంతి నెల పట్టాం.. మా ఇంట్లో ముగ్గువేసి .. మీ ఇంటి ముందు వేస్తాం.. ఇదీ ఒకప్పుడు ఓ వయసు వచ్చిన యువతులు ఈ తెలుగు లోగిళ్లలో చెప్పుకొన్నమాట. కొలువుతీర్చిన గొబ్బెమ్మలమధ్య ఆట. కానీ, నేడు అన్నీ ఇన్స్టెంట్. పాలు పోసేవాడు ఉంటే వాడి దగ్గర లేకపోతే.. ఎవరైనా అమ్మితే వారి దగ్గర ఇన్ స్టెంట్ గొబ్బెమ్మలు కొనేస్తున్నాం.. ఓ గంట పెట్టి పారేస్తున్నాం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషులు మారుతూ.. మనసులు మార్చుకుంటూ తెలుగింటి సంప్రదాయాలను పక్కన పెట్టేస్తున్నారు. లేడీకి లేచిందే పరుగు అన్నట్టు.. ఉదయం లేచినప్పటి నుంచి ఉరుకులపరుగుల జీవితాన్ని గడిపేస్తున్నారు.