తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్నిస్తాడు. గురువంటే అనంత విజ్ఞాన తరంగం.. గురువంటై జ్ఞానాన్ని ప్రసాదించే కిరణం.. మన జ్ఞానానికి మూలం గురువు.. మన గమ్యానికి మార్గం గురువు.. ఇది ఒకప్పటి మాట. వాస్తవానికి ఒకప్పుడు సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్నతమయిన స్థానం ఉండేది. ఎందుకంటే రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే కాబట్టి. ఇక అన్ని ఉద్యోగాల లాంటిది కాదు ఉపాధ్యాయ ఉద్యోగం. విద్యార్థుల ఆశయాలను, ఆకాంక్షలను గుర్తించి వాటి సాకారానికై విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే. అలాగే మంచి ఉపాధ్యాయులు మంచి విద్యార్థులనే గాక మంచి సమాజాన్ని కూడా నిర్మించగలరు.
అవును మరి..! గతంలో గురువంటే భయం, భక్తీ రెండూ ఉండేవి. వినయం విధేయతలతో పాటు గురువు పట్ల ఎంతో గౌరవం కూడా ఉండేది . కానీ మారిన ట్రెండ్లో గురువంటే .. కేవలం పాఠాలు చెప్పే.. మనకన్నా నాలుగైదేళ్లు ఎక్కువ వయసున్న వ్యక్తిగానే చూస్తున్న పోకడలు పెరుగుతున్నాయి. భయం భక్తీ స్థానంలో మితిమీరిన చనువు పెరిగిపోయింది. కొన్ని చోట్ల వివాదాలకు కూడా వెనుకాడడం లేదు. ఇంకొన్ని చోట్ల టీచర్లకే లైన్ వేస్తున్న ప్రబుద్ధులు ... పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
ప్రపంచం కుగ్రామమైపోయిన నేటి రోజుల్లో భారతీయ ఆచార వ్యవహారాలు,సాంప్రదాయాలు,సామాజిక పరిస్థితులతో పాటుగా విద్యావిధానం కూడా మార్పు చెందింది. ఒక ఒకప్పుడు గురువు వద్దకు విద్యార్థి వెళ్లి నమస్కరించి విద్యనభ్యసించేవారు. కానీ.. ఇప్పుడు గురువే విద్యార్థి ఇంటికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి హోమ్ ట్యూషన్ చెబుతున్నారు. అప్పుడు గురువంటే సమాజంలో భయం భక్తి.. నేడు గురువంటే ఓ ఉద్యోగి మాత్రమే. ఇలా మారుతున్న కాలాన్ని బట్టి గురువును కూడా ఓ జోకర్గా చూస్తున్నారు నేటి తరం యువత.