సంక్రాంతి.. తెలుగువారికి అతి పెద్ద పండుగ. అందుకే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ పండుగకు సొంత ఊరికి వచ్చే ప్రయత్నం చేస్తారు చాలా మంది. నగరాలు ఖాళీ అయ్యి పల్లెటూళ్లు కళకళలాడే శుభవేళ ఇది. అయితే అంతా ఊళ్లకు క్యూ కట్టడంతో రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇదే అదనుగా ఆర్టీసీ, రైళ్లు చార్జీలు పెంచేసి సగటు మానవుడికి పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. ఔను! ఇది నిజం. ప్రస్తుతం పెరిగిన రైలు, బస్సు చార్జీలతో పండగ రోజు సగటు ప్రయాణికుడు కుటుంబంతో కలిసి తన సొంతూరు వెళ్లివచ్చేందుకు కేవలం ప్రయాణాలకే రూ.10 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.
ఇద్దరు ముగ్గురు సభ్యులు ఉన్న ఓ ఫ్యామిలీ.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లాలంటే రు.20 వేలు ఎగిరిపోతున్నాయి. మళ్లీ పండుగ అంటే ఉండే ఖర్చులు మామూలే.. కొత్త బట్టలు, పిండివంటలు.. ఇలాంటివి ఎలాగూ తప్పవు. దీంతో సగటు మధ్య తరగతి జీవికి పండుగ ఖర్చులు చుక్కలు చూపిస్తున్నాయి.