సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా సంబరమే. ఎందుకంటే పక్రృతిని పోషించే శక్తి కలిగిన పౌష్య లక్ష్మి సృష్టిలోని సమస్తాన్నీ సిరులొలికించే చిరునవ్వుతో పలకరించే పర్వదిన సందర్భమే సంక్రాంతి. సంక్రాంతి ఒంటరిగా రాదని మన పెద్దలు అంటారు. అందుకే కాబోలు మహారాణిలా ముందు భోగి పండుగను.. వెనుక పరివారంలా కనుమ పండుగను వెంటేసుకుని.. చెలికత్తెల నడుమ రాకుమారిలా నడిచి వస్తుంది సంక్రాంతి. ఈ ప్రకృతి పండుగ నాడు పగలు - రాత్రి వేళలు సమానంగా ఉంటాయి.
ఇక ఈ పండగల విశిష్టత గురించి నేటి తరానికి అస్సలు తెలియడం లేదు. ఈ పండగల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడానికి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న పెద్దవాళ్ళు అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, ఇలా అందరూ చెప్పేవారు. ఇప్పటి రోజుల్లో అవన్నీ ఏమీ లేవు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఎవరి జీవితాలు వారుగా ఉద్యోగాలు, చదువులు అంటూ ఎవరి పొట్టకూటి కోసం వారు వేరు వేరుగా ఉంటున్నారు. దీంతో పిల్లలకు పండగలు, బంధాలు, బాంధవ్యాల గురించి అస్సలు తెలియడం లేదు. కాబట్టి తల్లిదండ్రులు నేటి తరానికి అసలు సంక్రాంతి అంటే ఏంటి సంక్రాంతి విశిష్టత అనేది వాళ్లకు చెప్పాలి. పశువులను చూపించి వాటి ప్రాముఖ్యత గురించి తెలపాలి. మన తరానికి మాత్రమే తెలిసిన ఎన్నో ఆనందాలను వాళ్లకు కూడా పరిచయం చేయండం మన బాధ్యత.