పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే కదలకుండా కూర్చుని ఒకటే పని చేస్తే లావయిపోవడం గ్యారెంటీ అంటున్నారు వైద్యనిపుణులు. శరీరంలో సరైన కదలికలు లేకపోతే ఎక్కడికక్కడ కొవ్వు శాతం పెరిగిపోయి లావయిపోతారు. పిల్లల్లో వయసుకు మించి బరువు ఉండడంతో అది చాలా రకాల సమస్యకు దారితీస్తుంది. ఈ మధ్య కాలంలో వచ్చే జబ్బులన్నీ కూడా బరువే ఎన్నో సమస్యలకూ, అనారోగ్యాలకూ కారణం అవుతోంది. చాలా మందిని ఈ బరువు సమస్యే బాగా వేధిస్తోంది. ఫలితంగా ఒబెసిటీ మందులు తయారుచేస్తూ... ఫార్మా కంపెనీలు వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఒబెసిటీ అన్నది పెద్దవాళ్లకే కాదు... పిల్లల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. ఇందుకు కారణం ఏంటా అని ఇటీవలె నిర్వహించిన సర్వేలో తేలింది. ఎక్కువ సేపు టీవీ చూస్తూ ఉండటమే అని తేలింది. అదే పనిగా టీవీ చూస్తున్న పిల్లలు విపరీతంగా బరువు పెరిగిపోవడమే కాదు... వాళ్లకు చిన్నప్పుడే బాన పొట్టలు వచ్చేస్తున్నాయి. ఇలా వచ్చిన పిల్లలు ఎన్ని ఎక్సర్సైజులు చేస్తున్నా బరువు తగ్గట్లేదు.
ఇకసారి ఒళ్ళు వచ్చిందంటే చాలు దాన్ని తగ్గించడం చాలా కష్టం. ప్రస్తుతం తీసుకునే ఆహారం కూడా అలానే ఉంటుంది. మనం తీసుకునే తిండి సరిగా లేకపోయినా సరే శరీరంలో కొవ్వు చాలా ఈజీగా చేరిపోతుంది. 9 నుంచీ 12 ఏళ్ల మధ్య వయసున్న 10వేల మంది పిల్లలపై ఓ పరిశోధన చేశారు. ఆ పిల్లలంతా టీవీల్లో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. కార్టూన్లు, యానిమేషన్లు చూస్తున్నారు. వాళ్ల హైట్, వెయిట్, నడుం చుట్టుకొలతను పరిశోధకులు పరిశీలించారు. ఎంత ఎక్కువ సేపు టీవీ చూస్తున్నారో, అంత ఎక్కువగా పిల్లలు లావు అవుతున్నట్లు తేలింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే... ఆ పిల్లలంతా ఎక్సర్సైజ్లు చేస్తున్నవాళ్లే. కానీ బరువు మాత్రం పెరుగుతున్నారు.
టీవీతోపాటూ కంప్యూటర్, మొబైల్ గేమ్స్ ఆడే పిల్లల పరిస్థితి ఇలాగే ఉంటోంది. అందువల్ల పేరెంట్స్ ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటు వైద్యులు సూచిస్తున్నారు. పిల్లలు టీవీ, కంప్యూటర్లను చూడటం ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. రోజుకు 3 గంటల కంటే ఎక్కువ సేపు చూస్తే డేంజరంటున్నారు.