పెళ్లిరోజున పెళ్లికొడుకు, పెళ్లికూతురు సంతోషంగా ఉంటారు. ఎన్నో కలలతో, ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెడతారు. వాళ్లు తమ వివాహ బంధం చిరకాలం ఉండాలని.. పెద్దల ఆశీర్వాదంతో తమ వివాహ జీవితం ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటారు. అయితే తాజాగా ఇలాంటి ఓ జంట క‌ల‌ల‌ను త‌ల్లిదండ్రులే న‌శ‌నం చేశారు. ఎలా అని అనుకుంటున్నారా.. పెళ్లికొడుకు తండ్రి, పెళ్లికూతురు తల్లి లేచిపోవడంతో ఆ జంట వివాహం ఆగిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే..  గుజరాత్‌లోని సూరత్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

 కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వివాహితకు పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంది. దీంతో సదరు వ్యక్తి కొడుకుకు ఆమెను ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు వర్గాలు నిశ్చయించాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం కూడా ఖరారు చేశారు. అయితే పెళ్లి పనులు జరుగుతుండగానే.. జనవరి 10 నుంచి వరుడి తండ్రి, వధువు తల్లి అదృశ్యమయ్యారు. రెండు ఇళ్లలోనూ ఇద్దరూ ఒకేసారి ఇలా కనిపించకుండా పోవడంతో అందరికీ అనుమానం వచ్చింది. 

 

చివరకు వారిద్దరూ పారిపోయారని తెలిసింది. కాగా, పెళ్లికొడుకు తండ్రి ఓ టెక్స్ టైల్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అతడు యుక్తవయసులో కాటర్‌గావ్‌లో ఉండే సమయంలో తమ పక్కింట్లో ఉండే యువతితో పరిచయం ఏర్పడింది. మంచి స్నేహితుల్లా ఉండేవారు. అప్పట్లోనే వారిద్దరూ కలసి ఉండేవారని తెలిసింది. అంతే  వారిద్దరి మధ్య బ్లాక్ అండ్ వైట్ సినిమాల టైమ్‌లో ఆగిపోయిన ప్రేమ.. ఇప్పుడు కలర్‌లో విచ్చుకోవడంతో ఇద్దరూ కలసి జంప్ అయిపోయార‌ని  బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: