ఒకప్పుడు ఉండే వాతావరణ పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు కాలుష్యం బాగా పెరిగిపోయింది. దాంతో దోమలు ఎక్కువయ్యాయి. అన్నీ కొత్త కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి. అందులో పసి పిల్లలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా ఉన్న బాడీలోకి ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది. ఇక విపరీతమైన జనసాంద్రత, మస్కిటో కాయిల్స్ వాడటం వలన పిల్లల్లో అధిక శాతం మంది ఆస్తమా వ్యాధి బారిన పడుతున్నారు. దుమ్ము, ఘాటైన వాసనలు, ఐస్క్రీమ్ వంటి చల్లటి వస్తువులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, పొగలు ఆస్తమాకు కారణంగా ఉంటాయి. చిన్నారుల్లో ఆస్తమా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు వైద్య సదుపాయాలేంటో ఈ రోజు బుడుగు శీర్షికలో చూద్దాం...
గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లల్లో 10 నుండి 15 శాతం మంది ఎక్కువగా ఆస్తమా బారిన పడుతుంటే, మరి సీటీలో పెరిగే పిల్లలు 15 నుండి 20 శాతం మంది దీని బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులకు వస్తున్న వారిలో అధికశాతం మంది చిన్నారులు ఆస్తమా సమస్యతో బాధపడుతున్నారు. ఆస్తమా సోకినప్పుడు తల్లిదండ్రులు గుర్తించకుండా, సాధారణ జలుబు, దగ్గుగానే భావిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఆస్తమా సోకిన చిన్నారులకు శ్వాస నాళాలు ముడుచుకుని వాటిలో కఫం చేరడం వల్ల శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. ఇది నిమోనియాకు దారితీయడంతో పాటు ఒక్కో సమయంలో ప్రాణాంతకంగా మారుతుంది. ఆస్తమాకు సకాలంలో చికిత్స చేస్తే పూర్తిగా నయమవుతుంది. ఆస్తమా కారణంగా ఎదుగుదలలో లోపం కనిపిస్తుంది.
ఎక్కువగా ఐస్క్రీమ్లు, కూల్డ్రింక్ల వల్ల ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ. బత్తాయి వంటి పండ్లు వల్ల, కొన్ని ప్యాక్డ్ ఫుడ్స్, కృత్రిమ రంగులు, ఫ్రిజ్లలో పెట్టిన ఆహార పదార్థాలు వ్యాధికి కారకాలు. పిల్లలకు ఆహారం విషయంలో ఆంక్షలు పెట్టే బదులు తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనిస్తూ ఏరకమైన ఆహార పదార్థాలు వారికి సరిపడవో గుర్తించి వాటిని మాత్రమే ఇవ్వకుండా ఉండటం మంచిది. ఆస్తమా అనేది భయపడాల్సిన జబ్బు కాదు. దీనిని సకాలంలో గుర్తించి వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే పూర్తిగా నివారించవచ్చు. తీవ్రమైన ఆస్తమాకు నెబ్యులైజర్ చికిత్సతోపాటు అవసరమైన సమయంలో ఇంజక్షన్లు ఇవ్వాలి.