మహిళలపై అరాచకాలు, అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. స్కూల్స్, కళాశాలలు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు, పనిప్రదేశాల్లో పోకిరీల లైంగిక వేధింపులతో నరకం అనుభవిస్తున్నారు. మహిళలపై దారుణాలకు పాల్పడిన మృగాళ్లకు శిక్ష పడుతున్నా.. షీటీమ్స్ వారి ఆటకట్టిస్తున్నా మార్పురావడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై అత్యాచారాలు, అత్యాచారయత్నాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా రక్షణ లేదు అని అనడానికి ఈ ఘటనే నిదర్శనం.
విద్యార్థులు చదువు పెట్టి ఉన్నతంగా తీర్చిదిద్ది.. వాళ్లను సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లే కామాంధులుగా మారి అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. కర్నూలు నగరంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నైట్ క్లాసుల పేరుతో కర్నూలులోని నవచైతన్య స్కూల్లో టీచర్లే కామాంధులుగా మారి అబ్బాయిలపై లైంగిక దాడికి యత్నిస్తున్నారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పైశాచికానందాన్ని పొందుతున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలను ఇతర విద్యార్థులకు చూపి హేళన చేస్తున్నారని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు.
అలాగే స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న యశ్వంత్, చరణ్, కార్తీక్ తమను నైట్ క్లాస్ల పేరుతో బలవంతంగా స్కూల్కి రప్పించి లైంగిక దాడికి పాల్పడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆశ్రయించిన తల్లిదండ్రులు.. నైట్ క్లాస్ల పేరుతో టీచర్లు తమ పిల్లలను వేధిస్తున్నారని, ఏకాంత ప్రదేశాలకు తీసుకెళ్లి దుస్తులు విప్పించి లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత విద్యార్థులను విచారించి సదరు టీచర్లపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు