చైనాలో ఇటీవల పుట్టుకొచ్చిన కొవిడ్-19(కరోనా వైరస్).. గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే కరోనా వేలమందిని బలితీసుకొంటోంది. వీళ్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది కూడా ఉన్నారు. శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు. మొట్టమొదటిగా ఈ వైరస్ వుహాన్లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్ లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్ కారణంగా వుహాన్లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్ను లండన్కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో కరోనావైరస్’గా గుర్తించారు. అయితే కరోనా వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ గానీ, యాంటీ వైరల్ చికిత్సా విధానం గానీ అందుబాటులో లేదు.
దీంతో ప్రజలు కరోనా అంటే చాలు వణికిపోతున్నారు. కరోనా బాధితుడు తుమ్మినా, దగ్గినా వైరస్ గాల్లోకి చేరుతుంది. అయితే ఈ కరోనా దెబ్బ ఇప్పుడు హోలీపై పడింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఆనందోత్సవాలతో జరుపుకునే రంగుల కేళీ. ఊరూరా, వాడవాడలా, ఇంటింటా రకరకాల రంగులతో కనువిందు చేసే పర్వదినం హోలీ. కుల మత బేధాలకు అతీతంగా ఆనందోత్సాహాల మధ్య పండగ జరుపుకుంటున్నారు. కానీ, గత కొద్ది రోజులుగా చైనా రంగులతో కరోనా వైరస్ వ్యాపిస్తోందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్గా మారాయి. ఈ సారి హోలీ పండుగను స్వదేశీ కలర్లతోనే జరుపుకోవాలని చైనా రంగులను దూరం పెట్టాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో తాజాగా ఈ విషయంపై వైద్యులు కూడా రెస్పాండ్ అయ్యారు. కరోనా వైరస్ అనేది రంగులతో రాదని.. అంతకుముందే వైరస్ సోకిన వ్యక్తి ద్వారానే సోకుతుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ అనేది విజృంభిస్తోందని.. కాబట్టి అక్కడి నుంచి వచ్చే చైనీస్ రంగులను వాడితే.. అందులో వైరస్ వచ్చే అవకాశం లేకపోలేదని కూడా పేర్కొంటున్నారు. ఇక ఏదేమైనప్పటికీ హోలీ పండుగకు చైనీస్ రంగులను దూరం పెట్టి.. స్వదేశీ రంగులను ఉపయోగించమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరియు కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచిస్తున్నారు.