తల్లిదండ్రులు.. వీళ్ళు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవారు. అసలు వీరు లేనిదే పిల్లలకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు.. ఎవరితో ఎలా ఉండాలో.. ఏది ఎలా నేర్చుకోవాలో.. ఇతరులతో ఆప్యాయంగా ఎలా కలిసిపోవాలో తెలియదు. ఏదైనా తల్లిదండ్రుల నుంచే పిల్లలు నేర్చుకుంటుంటారు. అయితే పిల్లలు పుట్టినప్పుడే తల్లీదండ్రీ పుడతారు. పిల్లలతో పాటు పేరెంట్ప్ కూడా ఎదగాలి. పిల్లలు సరైన దారిలో నడవాలంటే పేరెంట్స్ ఏం చేయాలి..? పిల్లల విషయంలో ఎలాంటి కేరింగ్ తీసుకోవాలి..? అన్న ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తారు.
అయితే పిల్లలు ప్రస్తుత కాలంలో టీవీలు, స్మార్ట్ ఫోన్లు అలవాటు పడిపోయారు. పిల్లలు అన్నం తినాలన్నా.. అల్లరి చేయకుండా ఉండాలన్నా.. చెప్పిన మాట వినాలన్నా.. అన్నింటికీ ఇవే పరిష్కారంగా మారుతున్నాయి. కాని, ఇవే వారి భావిష్యత్తును నాశనం చేయడమే కాకుండా.. ఆరోగ్య పరంగా కూడా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి వీటిని పిల్లలకు దూరంగా చేయాలంటే తల్లిదండ్రులు కాస్త కేర్ తీసుకోవాల్సిందే. పిల్లలను టవీ చూడొద్దు అంటూ ఒక్కసారిగా వారిని కట్టడి చేయకూడదు.
అలా చేస్తే.. పిల్లలు ఇంకా మొండిగా తయారౌతారు. అందుకే మెల్లమెల్లగా టీవీ చూసే సమయంతో తగ్గిస్తూ.. ఆ టైమ్ను వేరే వాటిపై డైవర్ట్ చేయాలి. బొమ్మలు వేయడం, ఆటలు ఆడించడం, మ్యూజిక్, స్విమ్మింగ్, ఇలా ఏదో ఒక యాక్టివిటీని వాళ్లకు నేర్పించాలి. అలాగే వీకెండ్స్ లో పిల్లలను కచ్చితంగా బయటకు తీసుకువెళ్లాలి. మరీ చిన్నపిల్లలు అయితే.. ప్లే స్కూళ్లలో చేర్పించడం ఉత్తమం. ఇలా వాళ్లకు తెలియకుండానే టీవీ, స్మార్ట్ఫోన్ల నుండీ డైవర్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లల భవిష్యత్తు మెరుగుపడడమే కాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా రక్షించవచ్చు.