ఒక పెద్దాయన రైతు..కొండలపైన ఉన్న తన పొలంలో యువకుడైన తన మనవడితో ఉంటున్నారు. రోజూ పొద్దున్నే లేచి వంటింట్లో ఉన్న బల్ల దగ్గర భగవద్గీత చదువుతూ కూర్చుంటారు…మనవడికి తాత చేసే పనులంటే చాలా ఇష్టం…తనూ అన్ని పనులూ తాతగారిలా చెయ్యాలనుకుంటాడు…
పొద్దున పూట తాత లానే తానూ భగవద్గీత  చదవటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల అవ్వటం లేదు…ఒకరోజు తాతని అడిగాడు…తాతా.. నువ్వు చదివినట్టు నేనూ భగవద్గీత చదవాలని ప్రయత్నిస్తే…ఎంత చదివినా అర్ధం కావటం లేదు…కష్టం మీద కొంచెం అర్ధం చేసుకున్నా…పుస్తకం ముయ్యగానే..మర్చిపోతున్నాను.

అసలు భగవద్గీత ఎందుకు చదవాలి మనం..ఏంటి ప్రయోజనం…అని తాతని అడిగాడు మనవడు…పొయ్యిలో బొగ్గు పెడుతున్న తాతగారు మనవడివైపు తిరిగి..తన చేతిలోని ఖాళీ అయిన బొగ్గు బుట్టని మనవడికి ఇచ్చి…కింద నది నుండి ఈ బుట్ట నిండా నీళ్ళు తీసుకుని రా..అని చెప్పారు…సరే తాత..అని మనవడు బుట్ట తీసుకెళ్ళి…నదిలో బుట్టను ముంచి కొండ పైకి ఇంటికి వచ్చేటప్పటికి నీళ్ళు బుట్ట నుండి కారిపొయ్యాయి…అది చూసి తాతగారు…ఓరి మనవడా..ఇంకొంచెం వేగం పెంచు..ఇంటికి రావటం లో అని సలహా చెప్పారు…సరే అని ఈ సారి ఇంకొంచెం వేగంగా బుట్టలో నీళ్ళు నింపి ఇంటికి వచ్చాడు మనవడు..బుట్ట ఖాళీ…తాతా..బుట్ట లో నీళ్ళు ఎలా నిలుస్తాయి…నేను గిన్నె తీసుకెళ్తాను అన్నాడు మనవడు..తాత చెప్పాడు…లేదు లేదు బుట్టతోనే నీళ్ళు తేవాలి..బహుశా నువ్వు ఇంకొంచెం ఎక్కువ శ్రమ పడాలి అనుకుంటా…ఇంకొంచెం శ్రద్ధగా ప్రయత్నిస్తే పని అవ్వచ్చు..అని మనవడిని ప్రోత్సహించారు.


మనవడు ఈ సారి ఇంకా వేగంగా నదిలో బుట్టను ముంచి..బుట్టలో నీళ్ళు నింపి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు…బుట్టలో నీళ్ళు నిలవలేదు…మళ్ళీ వెంటనే ఇంకోసారి కూడా ప్రయత్నించాడు…అయినా ఫలితం మాత్రం అదే…తాతగారు మనవడి కష్టం అంతా కిటికీలోంచి చూస్తూనే వున్నారు….ఖాళీ బుట్టతో ఆయాసపడుతూ నించున్న మనవడితో నవ్వుతూ చెప్పారు..ఒకసారి బుట్ట వైపు చూడు మనవడా…అని…మనవడు బుట్టను చూసాడు…నల్లని బొగ్గుల బుట్ట ఇప్పుడు చాలా శుభ్రంగా, తెల్లగా ఉంది.


తాతగారు చెప్పారు…భగవద్గీత చదివితే మనకు జరిగేది ఇదే…మనకు అర్ధం అవ్వనీ అవకపోనీ…గుర్తు ఉండనీ ఉండకపోనీ…చదివే సమయంలో మనకు తెలియకుండానే..మన ఆలోచనల్లో..మన దృక్పధం లో మంచి మార్పు వస్తూ ఉంటుంది…ఆ మార్పు మనకి వెంటనే తెలియదు కూడా…సందర్భాన్ని బట్టీ..అవసరమైన సమయం లో..ఆ మంచి మార్పు…ఉపయోగపడుతుంది…భగవద్గీత చదవటంలో కృష్ణుడు మనకు చేసే మేలు అదే…మన మనస్సులను శుభ్రపరచటం…ఏది ఏమిటో…ఏది ఎందుకో…సరైన అవగాహన మనకి తెలియచేయటం…ఇవన్నీ అనుభవపూర్వకంగా..ఎవరికి వారే తెలుసుకోగలుగుతారు….అని చెప్పి మనవడి ప్రశ్నకు సహేతుకంగా, ఉదాహరణతో సహా వివరించారు తాతగారు.


మరింత సమాచారం తెలుసుకోండి: