డిగ్రీ లేదు.. ఉద్యోగం లేదు.. ఆఫీసు లేదు.. బిజినెస్ కూడా లేదు.. అయినా నెల తిరిగేసరికి లక్షల్లో ఆదాయం సంపాదిస్తోంది ఆ యువతి. తోటివారంతా సోషల్ మీడియాతో టైమ్ పాస్ చేస్తుంటే అదే సమయాన్ని అర్థవంతంగా వాడుకోవడమెలాగో చేసి చూపిస్తోంది. పాతికేళ్లలోపే కోటిశ్వరురాలైంది. ఈ తరం యువతకు సరికొత్త పాఠం చెబుతోంది.
ఆష్నాష్రాఫ్ అనే పాతికేళ్ల యువతి ఇన్స్టాగ్రామ్ ద్వారా కోటీశ్వరురాలైన తొలి భారతీయురాలు. స్కూల్లో ఉన్నప్పుడే ప్రారంభించిన ఆ ఎకౌంట్లో అందరు టీనేజర్లలా సెల్ఫీలు, పిచ్చిపిచ్చి కామెంట్స్ పెట్టకుండా తనకు తెలిసిన మేకప్, స్టైల్ టిప్స్ చెబుతూ ఫొటోలు పెట్టేది. అవి చాలామందికి నచ్చాయి. ఫాలోవర్లు పెరిగారు. లైక్లతో మోతమోగిపోయింది. అలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిన ఆష్నా ఇన్స్టాగ్రామ్ సంపాదన ఇప్పుడు నెలకు 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటోంది. ఏదైనా సాధించాలంటే డిగ్రీ ఉండాల్సిన అవసరం లేదని అమ్మ చెప్పిన సలహా నచ్చేసి, ఇంటర్తో చదువు ఆపేసి, ఆన్లైన్ స్టోర్ ప్రారంభించేసింది.
మరోవైపు ఫ్యాషన్, టూరిజం అంశాలపై సొంత బ్లాగు రాస్తోంది ఆష్నాష్రాఫ్. దానిద్వారా కూడా మరో ఏడెనిమిది లక్షలకు తగ్గకుండా ఆదాయం వస్తోంది. వీటికి తోడు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఫ్రెండ్స్ అంతా ఉన్నత చదువులూ పోటీ పరీక్షలతో తలమునకలవుతోంటే ఆష్నా తానే కొందరికి ఉద్యోగం ఇచ్చి బిజీబిజీగా దేశాలు తిరిగేస్తోంది.
ఆష్నా చిన్నప్పుడే అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారు. తల్లి ఉద్యోగం చేస్తూ ఆష్నాని పెంచింది. ఇల్లు గడపడానికి అమ్మ పడుతున్న కష్టం చూసిన ఆష్నాకి ఎప్పుడెప్పుడు పెద్దదాన్నై సంపాదించాలా అని ఉండేదట. ఆ కోరికకి పట్టుదలను చేర్చి కష్టపడి పనిచేసి 25 ఏళ్లకే కోటీశ్వరురాలవడమే కాదు సొంతిల్లు కొని తల్లినీ తాతయ్యనీ కూడా సంతోషపెట్టింది. చేసే పనిలో తనదైన స్టైల్ చూపిస్తూ స్పెషాలిటీ చూపించడమే తన సీక్రెట్ అంటోంది ఈ యువతి.
మొత్తానికి.. అవకాశం ఒకరు ఇవ్వడం కాదు, తనకు తానే సృష్టించుకోవాలని చెబుతున్న ఈ యువతి సక్సెస్.. ఈ తరం యూత్కు మంచి ఇన్స్పిరేషన్.