ఒకప్పుడు సంపన్నుల సంతానం మాత్రమే ధనికులు. సీన్ మారింది. ఆలోచనలే మనుషులను సంపన్నులుగా మారుస్తున్న కాలం ఇది. సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదంటారు. ఇప్పుడలా కాదు.. ఎక్కడ సరస్వతీ దేవి ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటోంది. లక్ష్మి-సరస్వతి.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న యుగమిది. అందుకే ఆ గుమస్తా సరస్వతి దేవిని ప్రసన్నం చేసుకుని లక్ష్మి దేవిని ఆహ్వానించాడు. గుమస్తా ఉద్యోగం నుంచి 10 కోట్ల టర్నోవర్ కంపెనీకి అధిపతిగా మారాడు.
ఛాయ్ తీసుకురా..? ఆ ఫైల్ తీసుకురా.. అంటే పట్టుకుని ఆ ఆఫీసులో పరుగెత్తే ఆ గుమస్తా.. కోట్ల రూపాయల సాప్ట్వేర్ కంపెనీకి అధిపతి అవ్వడం వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. కన్నీళ్లు ఉన్నాయి. ఆకలి బాధలు ఉన్నాయి. సాదాసీదా గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించాడు. కానీ మనసులో ఎక్కడో చదువుకోవాలన్న తపన అలాగే వుండిపోయింది. జీవితంలో ఉన్నత శిఖరాలు ఎదగాలన్న కసి ఉంది. అందుకే పగలు డ్యూటీ.. రాత్రి చదువు.
హిమాచల్ ప్రదేశ్లోని మారుమూల గ్రామానికి చెందిన ఛోటూ శర్మ 1998లో ధలియారా కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్స్ చేయాలని ఉన్నా.. చేతిలో డబ్బు లేదు. ఫీజు కట్టడానికి కనీసం 5 వేల రూపాయలు కూడా లేని నిస్సహాయత. అయినా సరే రాజీపడలేదు. కంప్యూటర్ తెలిసుంటే భవిష్యత్ ఉంటుందని భావించాడు. ఆ సంకల్పంతోనే చండీగఢ్ వచ్చాడు. ముందు రోజు ఖర్చులైనా గడవాలి. అందుకే ఒక కంప్యూటర్ సెంటర్లో గుమస్తాగా చేరాడు. అందులో డ్యూటీ చేస్తూనే రాత్రిళ్లు కంప్యూటర్ కోర్స్ చేశాడు. మొత్తానికి మైక్రోసాఫ్ట్ డెవలపర్ గా సర్టిఫికెట్ సంపాదించాడు.
ఆ క్రమంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఇబ్బందులు.. డబ్బులు సరిపోక రాత్రిళ్లు పస్తులు పడుకున్న సందర్భాలు ఎన్నో. ఈ లోగా ఒకచోట చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లినా కాలినడకే. సైకిల్ కూడా లేదు. ఒక్కోక్క పైసా సంపాదించి ఒక ద్విచక్రవాహనం కొన్నాడు. రెండేళ్ల తర్వాత కంప్యూటర్ తీసుకున్నాడు. సర్టిఫికెట్ అందుకుని ఇంట్లో కంప్యూటర్ పెట్టుకున్నాడు. స్వయంకృషితో సాప్టువేర్ డెవలపర్ గా మరింత రాటుదేలాడు. ఆప్టెక్ కంప్యూటర్ సెంటర్లో ఫ్యాకల్టీగా చేరాడు. ఆ ఉద్యోగం చేస్తూనే టైమ్ దొరికినప్పుడల్లా మధ్యాహ్నం, సాయంత్రం కొంతమందికి క్లాసులు కూడా చెప్పేవాడు. అలా చేతిలో కొంత డబ్బు కనిపించింది. అయితే ఛోటూ శర్మ లక్ష్యం ఇది కాదు. ఒక కంప్యూటర్ సెంటర్ పెట్టాలనేది అతడి ప్లాన్.
చివరికి తన ఆలోచనను అమల్లో పెట్టేశాడు. డబుల్ బెడ్రూం తీసుకుని అందులో కంప్యూటర్ సెంటర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు తిరిగేసరికి 80 మంది స్టూడెంట్స్ అయ్యారు. అందులో ట్రైనింగ్ తీసుకుని ఆ స్టూడెంట్స్ కార్పోరేట్ కంపెనీల్లో ప్లేస్ మెంట్స్ అందుకున్నారు. దాంతో ఛోటూ శర్మ ఇనిస్టిట్యూట్ పై జనాల్లో నమ్మకం పెరిగింది. పరపతీ పెరిగింది. అలా 2007లో సీఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థను వేర్వేరు చోట్ల స్థాపించాడు. ప్రస్తుతం అతని కోచింగ్ సెంటర్లో వేలాది మంది విద్యార్దులన్నారు. 200 మంది స్టాఫ్ ఉన్నారు. ఏడాది తిరక్కముందే కంపెనీ టర్నోవర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఎంత లేదన్నా ఛోటూ శర్మ ఏడాది ఆదాయం 10 కోట్ల రూపాయలకు పైమాటే.
తిరుగుని స్థాయికి చేరాలన్న కసితో జీవితంలో గెలిచిన ఛోటూ శర్మ.. సంపాదన విషయంలోనే కాదు.. సామాజిక సేవ చేయడంలోనూ ముందుంటాడు. పేద పిల్లల చదువు కోసం తనవంతు సాయం చేస్తుంటాడు. సరస్వతి ఉంటే లక్ష్మి కూడా ఉంటుందని నిరూపించాడు. ఈ తరం యువతకు కంప్యూటర్ పాఠాలే కాదు జీవిత పాఠాలు కూడా నేర్పుతున్నాడు. దటీజ్ విజయం.. ఛోటూ శర్మ..!