భిన్నంగా ఆలోచించడం, ఆలోచనలు వినూత్నంగా అమలు పరచడం, దమ్ముధైర్యం ఏ మాత్రం సడలకపోవడం.. ఇవీ చాలు వందల కోట్లు అలా సంపాదించొచ్చు అంటూ నిరూపించాడు ఓ చిచ్చరపిడుగు. తలుచుకుంటే స్టార్టప్ను రాకెట్ స్పీడ్లో పరుగెత్తించవచ్చని చేసి చూపించాడు. కేవలం ఎనిమిది వేల రూపాయలతో ఏకంగా 500 కోట్ల రూపాయలు సంపాదించాడు. గూర్గాన్ కేంద్రంగా ప్రారంభించిన ఓ స్టార్టప్ కంపెనీ ఓనర్ అమిత్ దాగా సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం.
నునుగు మీసాల వయసు.. కేవలం కాలేజీ పాసైన కుర్రాడు.. పట్టుమని 19 ఏళ్లు నిండలేదు. కానీ ఎంతో అనుభవం గడించాడు. బిజినెస్ మెళకువలను గుర్తించాడు. మార్కెట్ రంగంలో తిరుగులేని హీరో అయ్యాడు. మల్టీ నేషనల్ బ్రాండ్స్ శాంసాంగ్, ఫిలిప్స్, హెచ్పీ, లెనెవో, హావెల్స్.. వంటి కంపెనీలకు ఆథరైజ్డ్ డీలర్గా ఉన్నాడు అమిత్. కన్సూమర్ డ్యూరబుల్ అండ్ ఐటీ ( సిడిఐటి) వస్తువులను డెలివరీ చేస్తుంది ఈ కంపెనీ.
సీడ్ కేపిటల్ కింద కేవలం ఎనిమిది వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు అమిత్. 1999లో డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. దాని పేరు డీబీఎం మార్కెటింగ్. తొలి రోజుల్లో బిజినెస్ అంతగా సాగలేదు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు. లక్సార్ పెన్నులను కూడా అమ్మాడు గుర్గాన్లో. డీల్ క్యా హై.. ఇదీ అమిత్ దాగా ట్యాగ్ లైన్. లైఫ్ లైన్ కూడా. వినియోగదారులు కోరుకున్న వస్తువులను అందించడం అనేదాని మీదే దృష్టిపెట్టాడు.
ఇపుడు అమిత్కు 38 ఏళ్ల వయసు. గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. ఐఎంటీ ఘజియాబాద్ నుండి పీజీడీబీఎం చదివాడు. కార్పొరేట్ కంపెనీల దగ్గరకు వెళ్లినప్పుడల్లా నన్ను పట్టించు కోలేదు. నిదానంగా వారంతా నన్ను నమ్మడం మొదలుపెట్టారు. క్వాలిటీ, డెలివరీ అనేది కరెక్టుగా ఉండాలి. టైమ్ మిస్వవ్వద్దు. ఇదే విజయానికి తొలి సూత్రం అంటారాయన. పార్కర్ పెన్నులు గుర్తుండే వుంటాయి. ఎన్ని పెన్నుల కంపెనీలు మార్కెట్లోకి వచ్చినా.. ఆ కంపెనీ బ్రాండ్ ప్రతి కంపెనీలో కనిపిస్తుంది. బ్రాండ్ అలాగే ఉంది.. నాణ్యత కూడా ఇప్పటి వరకు ఒకటే. రీజినల్ మేనేజర్గా ఉన్న రోహిత్ మాథుర్ తనకు ఆదర్శమంటాడు అమిత్ దాగా. సంస్థాగతంగా ఎలా సేల్ చేయాలి, కార్పొరేట్ క్లయింట్స్ దగ్గరకు వెళ్లేటప్పుడు ఎలా ప్రజెంటేషన్ చేయాలో దగ్గరుండి మాథుర్ మెళకువలు అమిత్ కు చెప్పారు. అవి ఎంతగానో తన బిజినెస్ మార్కెటింగ్కు ఉపయోగ పడ్డాయి. రోహిత్ ఇండియాలోనే బెస్ట్ సెల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. కోట్లల్లో పెన్నులు అమ్మాడు. అమ్మడం ఎవరైనా చేస్తారు.. కానీ మన వస్తువుకున్న బ్రాండ్ పెంచుకుంటూపోవాలి. కస్టమర్లు వారంతకు వారే వస్తుంటారు అంటారు అమిత్. ఎవరికైతే సప్లయ్ చేస్తామో వారికి 30 నుంచి 35 రోజులు గడువు ఇవ్వడం వల్ల మరింత సేల్స్ పెంచుకునే వీలు కలుగుతుంది. ఆ తర్వాత క్రమంగా డీబీఎం మార్కెటింగ్ పుంజుకుంది. భారతీ టెలీటెక్ కంపెనీతో ఒప్పందం పెట్టుకున్నాడు. ఆ కంపెనీ కన్సూమర్ డ్యూరబుల్ అండ్ ఐటీ ప్రొడక్ట్స్ సరఫరా చేసేలా డీల్ చేసుకున్నాడు. లాప్టాప్స్, మొబైల్స్, మిక్సర్స్, జార్స్, కిట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
డీబీఎం కంపెనీని ప్రారంభించినప్పుడు అతడు ఒక్కడే. ఆఫీస్ బాయ్, అడ్మిన్ గై, డెలివరీ బాయ్, అకౌంటెంట్, సేల్స్ మెన్ ఇలా.. అన్ని అవతారాలు ఎత్తాడు. సేల్స్మెన్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్ గా ఇన్నో పనులు చేశాడు. నెల రోజుల పాటు కాళ్లరిగేలా తిరిగాడు. 35 లక్షల విలువ చేసే పెన్నులు అమ్మాలన్నది టార్గెట్. దానిని 50 లక్షల రూపాయలకు అమ్మాడు అమిత్. ఈ కామర్స్ బిజినెస్ ఊపందుకోవడంతో ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంను డెవలప్ చేశాడు. డైరెక్టుగా ప్రొడక్టు తయారు చేసే కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నాడు అమిత్. రిటైల్ నెట్వర్క్కు శ్రీకారం చుట్టాడు. ఆన్లైన్లోకి అడుగుపెట్టాడు. ముందుగా ఓ పోర్టల్ స్టార్ట్ చేశాడు. ఆధునిక అవకాశాన్ని అందుకుని ఆకాశమంతా ఎదిగేందుకు సిద్ధమైపోయాడు.
పాన్ ఇండియా, టెక్నాలజీ, లాజిస్టిక్ పార్టనర్ షిప్ కింద కంపెనీని రిజిష్టర్ చేశాడు. రిలయబుల్ ప్రాడక్ట్స్ అన్నింటికి స్పెషలైజ్డ్గా ఆథరైజ్డ్ డీలర్గా బడా కంపెనీలు గుర్తించాయి. అమెజాన్ కంపెనీ కూడా డీబీఎంతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం దీని టర్నోవర్ నెలకు 40 నుంచి 50 కోట్ల రూపాయలు.
క్వాలిటీ, సమయానికి అందించడం, విశ్వసనీయత.. ఉండడంతో కంపెనీలన్నీ డీబీఎం కోసం క్యూ కట్టాయి. ఇంకేం ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, షాప్ క్లూస్.. వంటి కంపెనీలన్నీ కూడా ఇందులోకి వచ్చేశాయి. ఈ కంపెనీలతో పాటు లాజిస్టిక్స్ పార్టునర్స్ గా బ్లూ డార్ట్, ఫెడెక్స్, డిల్లీవెరీ, ఆరామెక్స్, ఫస్ట్ ఫ్లైట్ కూడా ఇందులో ఉన్నాయి. తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలో వేర్ హౌస్లను ఏర్పాటు చేస్తోంది. 2020 నాటికల్లా రెండు వేల కోట్ల టర్నోవర్ సాధించాలన్నది తన ముందున్న లక్ష్యమంటాడు అమిత్. మొత్తానికి అమిత్ సాధించాడు. తన అభివృద్ధితో ఈ తరానికి స్టార్టప్ పాఠాలు చెబుతున్నాడు.