విజయం ఎలా సాధించాలి? ఎక్కడ సాధించాలి? వనరులు ఎలా? ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్లాలి?.. ఇలా స్టార్టప్ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఎదురయ్యే ప్రశ్నలే. ఎక్కడికో వెళ్లి ఏదో సాధించాలని కలలుగనడంలోనే సమయమంతా వృధా చేసుకోవద్దంటూ ఇద్దరు కుర్రాళ్ల నిరూపించారు. ఏ స్టార్టప్ మొదలుపెట్టాలని ఎక్కడికో వెళ్లలేదు. తమ ముందు కనిపిస్తున్న టీ కొట్టునే బిజినెస్గా మార్చి కోట్లు సంపాదించే పనిలో పడ్డారు.
టీ కొట్టే కదా.. అని తేలిగ్గా తీసిపారేయకండి. తలుచుకుంటే కోట్ల రూపాయల టర్నోవర్ సాధించవచ్చని నిరూపించారు ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు. టీ కొట్టుకు 2 కోట్ల టర్నోవరా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? ఈ రోజుల్లో తెలివితేటలు, పట్టుదల ఉండాలేగానీ సాధించలేని ఏదీ లేదు. ఇందుకు ఈ ఇంజినీరింగ్ కుర్రాళ్లే నిదర్శనం. ఆహారం డెలివరీ తరహాలోనే వీరు కూడా ‘చాయ్ కాలింగ్’ పేరుతో ఇంటింటికీ టీ డెలివరీ చేయడం మొదలుపెట్టారు. అలా కొన్నేళ్లలోనే ప్రధాన నగరాలన్నింటికీ వ్యాపారాన్ని విస్తరించారు.
అభినవ్ టండన్, ప్రమిత్ శర్మ ప్రారంభించిన ఈ ‘చాయ్ కాలింగ్’కు వేల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. ప్రతి ఇల్లు.. ఆఫీసులో వీరి అందించే ఛాయ్ కస్టమర్లే ఉంటారు. వివిధ నగరాల్లో 15 టీ స్టాళ్లను నడుపుతున్న అభినవ్, ప్రమిత్లు ఏటా 2 కోట్ల రూపాయల టర్నోవర్ పొందుతున్నారు. బరేలీకి చెందిన అభినవ్, ప్రమిత్ లక్నోలో ఇంజినీరింగ్ చదివారు. ఇద్దరు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారు. అయితే, రొటీన్ లైఫ్కు విసుగెత్తిపోయిన ఈ ఇద్దరికీ కొత్తగా ఏదైనా చేయాలని అనిపించింది. దీంతో 2014లో ‘చాయ్ కాలింగ్’ పేరుతో ఢిల్లీ శాటిలైట్ సిటీ నొయిడా సెక్టార్-16 మెట్రో స్టేషన్ వద్ద టీ-స్టాల్ ప్రారంభించారు.
ఆఫీసులో ఉన్నప్పుడు మిషన్లోని టీ తాగాల్సి వచ్చేదని, దీంతో బయటకు వెళ్లి చాయ్ తాగేవాళ్లమని గతం చెప్పాడు అభినవ్. అప్పుడే ఈ ఐడియా వచ్చిందని, లక్ష రూపాయల పెట్టుబడితో ‘చాయ్ కాలింగ్’ పేరుతో ఒక టీస్టాల్ ప్రారంభించామని తెలిపాడు. దాని పేరు మీద ఒక వెబ్సైట్ కూడా ఏర్పాటుచేశామని, బిజినెస్ పెరగడంతో చాలా సంస్థల నుంచి తమకు ఆర్డర్లు రావడం ఆరంభమైందని, అప్పటి నుంచి డెలీవరీలు మొదలుపెట్టామని చెప్పాడు. ఒక కప్పు టీ ధర కేవలం 10 రూపాయల నుంచి 15 రూపాయలు మాత్రమే అని తెలిపాడు.
ఆ తర్వాత ఇద్దరూ తమ సేవలను ఇళ్లకు కూడా విస్తరించారు. 15 నిమిషాల్లో టీ డెలివరీ చేస్తామంటూ డోర్ డెలివరీ సేవలు విస్తరించారు. నొయిడాలో 3, బరేలీలో 6 స్టాళ్లు ఏర్పాటుచేశారు. దీంతో క్రమేనా సంస్థ టర్నోవర్ పెరగడం ప్రారంభమైంది. 2015లో 50 లక్షల రూపాయల టర్నోవర్ వస్తే.. 2019లో అది 2 కోట్ల రూపాయలకు చేరింది. ‘చాయ్ కాలింగ్’ ద్వారా 100 మంది యువతకు ఉపాధి కూడా అందిస్తున్నారు. త్వరలో తమ స్టార్టప్ విస్తరణలో భాగంగా మరింత మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. సంకల్పం గట్టిదైతే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపిస్తున్న ఈ ఇద్దరు కుర్రాళ్లు ఈ తరం యూత్ను కచ్చితంగా స్ఫూర్తి ఇస్తారని చెప్పొచ్చు.