మహా విజయాలు కొందరికే సాధ్యమవుతాయా? అర్హత ఏంటీ? ఎవరైతే సాధించగలుగుతారు? అనే సందేహాలకు ఒక కొలమానం లేదంటూ సక్సెస్ జర్నీ చేస్తున్నారు ఈ తరం యువత. వయసుతో పనేంటీ అంటూ ఏకంగా ఇరవై ఏళ్ల వయసులోనే కోట్ల బిజినెస్ టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగాడు హైదరాబాద్కు చెందిన ఓ కుర్రాడు. బిజినెస్ ఉద్దండులే భయపడే ఫీల్డ్లో దుమ్మురేపుతున్నాడు.
హైదరాబాద్ కి చెందిన ఈ ఇరవయ్యేళ్ల కుర్రాడి పేరు సంకర్ష్ చందా. ఒక సాధారణ మద్యతరగతి కుటుంబం. చదువులోనూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే ఇష్టం. అలా బాల్యంలోనే.. ఆస్ట్రోఫిజిక్స్, నానోటెక్నాలజీలను కుతూహలంతో చదివాడు. దీంతోపాటు ఇంగ్లీష్ స్టోరీలు, నవలలూ చదివే అలవాటుండేది. అలా ఏడోతరగతిలో ఉండగా స్టాక్మార్కెట్పై బెంజమిన్ గ్రాహం రాసిన ఓ ఆర్టికల్ను చదివాడు. బాగా నచ్చింది. మార్కెట్లో కొనటమేంటీ? అమ్మటమేంటీ?అనే ఆసక్తి అతనిలో పెరిగింది. వెంటనే సంకర్ష్ తన అక్క దగ్గర ఉండే డీమ్యాట్ అకౌంట్ తీసుకున్నాడు. రాత్రికి రాత్రే స్టాక్స్లో డబ్బులు వస్తాయనే ఆశ అతనిలో ఉండేదప్పుడు. ఖర్చులకు నాన్న ఇచ్చే వెయ్యి రూపాయలనీ, హుండీలోని డబ్బులను స్టాక్స్లో పెట్టాడు. ఒక్కో షేర్ 10 రూపాయలుంటే.. 1000 రూపాయలకి ఏకంగా 100 షేర్లు వస్తాయనే ఆలోచన ఉండేది. దీంతో మార్కెట్లో చీపెస్ట్ కంపెనీలపై పెట్టుబడి పెట్టాడు. రెండునెలల్లో అంతా పోయింది. బాధపడ్డాడు. ఇది కాదు, దీంట్లో ఏదో ఉందనుకున్నాని అడుగుముందుకేశాడు. మెల్లగా మార్కెట్ను ఇష్టంతో స్టడీచేయడంపై మనసు లగ్నం చేశాడు. మొదట ఓ కంపెనీ వార్షిక రిపోర్టును తీసి.. దాని 10 ఏళ్ల హిస్టరీ అబ్జర్వూ చేశాడు. అప్పుడు అతని బుర్రలో ఓ వెలుగు వెలిగింది. అసలు విషయం అర్థమైంది. మార్కెట్ మనకంటే పెద్దది. మనకంటే స్మార్ట్. మనకంటే ఫాస్ట్ అని. ముందు మార్కెట్కి రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయమర్థమైంది. తనకేం తెలియదో అర్థం చేసుకున్నాడు. పట్టినపట్టు విడవకుండా అలా స్టాక్స్లో ఓనమాలు నేర్చుకున్నాడు. మార్కెట్లో ఒక్కో మెలుకువ తెలుసుకుంటూ చాలా విషయాలు అర్ధం చేసుకున్నాడు. అదే అతడు సొంతగా ఒక కంపెనీ పెట్టాలనే ఆలోచనకు కారణమైంది.
కేవలం 19 ఏళ్ల వయసులోనే తానే స్వయంగా ఒక స్టార్టప్ను ప్రారంభించి.. తన కంపెనీ ద్వారా 14 కంపెనీలకు సేవాలందిస్తూ ఏడాదికి దాదాపుగా 20 కోట్ల రూపాయలకుపైనే బిజినెస్ చేస్తున్నాడు ఈ హైదరాబాద్ కుర్రాడు. చిన్న వయసులోనే సావర్ట్ అనే స్టాక్ మార్కెట్ అడ్వైజరీ కంపెనీ స్థాపించి ప్రస్తుతం దానికి సీఈఓ, ఫౌండర్గా కొనసాగుతున్నాడు. 20 ఏళ్ల వయసులో చదువు, ర్యాంకులు, సినిమాలు, ప్రెండ్స్ అంటూ షికార్లు తిరిగే యువతకు భిన్నంగా ఏదైనా సాధించాలనే తపనతో 2017లో సావర్ట్ అనే కంపెనీని రిజిస్టర్ చేశారు. ఉద్దండులే భయపడే ఈ ఫీల్డ్ను బిజినెస్గా ఎంచుకోవడం.. అదీ 20 ఏళ్ల వయసుకే కావడం.. పెద్ద సాహసమనే చెప్పాలి. ప్రస్తుతం దాదాపు 14 కంపెనీలతో పాటు కొంత మందికి వ్యక్తిగతంగా షేర్స్, స్టాక్ మార్కెట్ గురించి సలహాలు ఇస్తున్నాడు. తన అనుభవాలతోనే.. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ‘ఫైనాన్షియల్ నిర్వాణ’ అనే పేరుతో ఓ పుస్తకం రాశాడు. ఆ పుస్తకం మార్కెట్లోకి రావాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం మా కంపెనీ సావర్ట్ హైదరాబాద్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా 14 ప్రముఖ కంపెనీలకు స్టాక్ మార్కెట్ సలహాదారుడిగా ఉంది.కేవలం కంపెనీలకే కాకుండా వ్యక్తిగతంగా ఎవరైన స్టాక్ మార్కెట్లో ఇన్వేస్ట్ చేయాలనుకుంటే సలహాలు ఇస్తుంటాడు. 2017లో స్థాపించిన మా కంపెనీ ప్రస్తుత ఏడాది రూ.20 కోట్ల టర్నవర్ చేస్తోంది. అది ఎంతో కిక్ ఇచ్చే విషయం అంటూ తన విజయగాథ చెబుతాడీ కుర్రాడు.
స్టాక్ మార్కెట్ గురించి ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయని.. ఓ మధ్యతరగతి వ్యక్తి కూడా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించేలా చేయాలనేదే తన లక్ష్యం అని ఆత్మవిశ్వాసంతో చెబుతాడు సంకర్ష్.