పూర్వం ముగ్గురు యువకులు గుర్రాలపై వెళ్తుండగా వారికి ఒక ఋషి ఎదురుగా వచ్చి ఇలా చెప్పాడు .


"ఓ యువకులారా.. మీకు ఇక్కడ నేలపై కనిపించిన వాటిని పోగుచేసుకుని సంచులలో వేసుకుని ఇంటికి వెళ్లండి.
ఆ సంచులను రేపు తెల్లవారుజామున తెరిచి చూస్తే మీకు ఓ మహాద్భుతంను చూస్తారు. ఆ అద్భుతాన్ని చూసిన వెంటనే మీరు, సంతోషాతిరేకంతో చిందులు వేస్తారు. అయితే ఆ మరుక్షణమే భోరున ఏడుస్తారు" అని అన్నాడు.


ఋషి మాటలు విన్న ఆ యువకులు, గుర్రాలపై నుంచి కిందికి దిగి, అటుఇటు చూశారు. వాళ్లకు నేలపై ఎంతదూరం చూసినప్పటికీ గులకరాళ్లు తప్ప మరేమీ కన్పించలేదు.
అయినా ఋషి చెప్పాడు కనుక, మనిషికి నాలుగైదు గులకరాళ్లను సంచులలో వేసుకుని వెళ్లి, ఇంట్లో ఓ మూలన పెట్టి నిద్రపోయారు.


మరుసటి రోజు ఉదయం సంచులను తెరిచి చూసిన ఆ యువకులు, ఋషి చెప్పినట్లు ఒక్కసారిగా సంతోషంతో వెర్రి కేకలు పెట్టారు. అయితే ఆ మరుక్షణమే అయ్యో అని ఏడవసాగారు.
ఎందుకంటే, వాళ్లు మూటగట్టుకొచ్చిన గులకరాళ్లు వజ్రాలుగా మారిపోయాయి. ప్రస్తుతం వాళ్ల ఏడుపు, మనిషికి ఒక గోతాము రాళ్లను మూటగట్టక రాలేక పోయామే అని.


"చదువు కూడా అంతే... చదువుకునే వయసులో శ్రద్ధగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే, ఆ తర్వాత మనకు చదవాలని ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందుకు అనుకూలించవు*
 


మరింత సమాచారం తెలుసుకోండి: