వివాదాస్పద యాప్గా విమర్శలు ఎదుర్కుంటున్న టిక్ టాక్ మరో ప్రాణాన్ని బలిగొంది. టిక్ టాక్ పరిచయంతో ప్రేమించుకున్న యువతీ యువకుల అనుబంధం విశాదంగా ముగిసింది. కర్నూలుకు చెందిన అమ్మాయి హైదరాబాద్ ఎస్సార్ నగర్ లోని ఎర్రగడ్డ నేతాజీ నగర్కు చెందిన సాయి 24 సంవత్సరాలు అనే అబ్బాయికి మధ్య పరిచయం కుదిరింది. సాయి జొమాటోలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ప్రేమ పేరుతో కర్నూల్ అమ్మాయి వద్ద సాయి ఆర్థిక అవసరాల కోసం డబ్బులు, బంగారు గొలుసు తీసుకున్నట్లు సమాచారం.
అయితే, బంగారు గొలుసు, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో యువతి తన కుటుంబ సభ్యులతో కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు కర్నూల్ పోలీసులు సాయికి ఫోన్ చేశారు. విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో... భయంతో సాయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. సాయి మృతదేహాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.