టిక్ టాక్ వీడియో లపై ఉన్న మోజు పలువురు ప్రాణాల మీదకు తెస్తున్నా, ఈ వ్యసనాన్ని వీడకుండా బలి అవుతున్న వారు ఎంతోమంది ఉంటున్నారు . టిక్ టాక్ వీడియో లు చేయబోయి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజూ, రోజుకి పెరుగుతోంది . తాజాగా నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలం గోన గొప్పల్ గ్రామ శివార్లలో కప్పలవాగు లో పొంగిపొర్లుతుండడం తో అదే గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేష్ తన స్నేహితులతో కలిసి చూడడానికి వెళ్ళాడు . స్నేహితులతో కలిసి సరదాగా టిక్ టాక్ వీడియో లు తీసుకుంటుండగా ఒక్కసారి వరద ప్రవాహం పెరిగి దినేష్ కొట్టుకుపోయాడు .
వరద ఉధృతిని గమనించిన ఒడ్డున ఉన్న వారు చీరెలు విసరడం వాటి సహాయం తో దినేష్ స్నేహితులు గంగాజలం , మనోజ్ లు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకోగా , దినేష్ మాత్రం చీరెలను అందుకోలేక … వరద ఉధృతికి కొట్టుకుపోయాడు . గత 24 గంటల నుంచి దినేష్ కోసం అధికార యంత్రాంగం గాలిస్తున్న అతని ఆచూకీ తెలియకపోవడం తో దినేష్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు . టిక్ టాక్ పేరిట ప్రమాదకర పరిస్థితుల్లో వీడియో లు తీసుకోవడం , ఇటీవల యువత లో ఫ్యాషన్ గా మారింది .
ఈ క్రమం లో పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. టిక్ టాక్ వీడియోల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏమిటన్న విమర్శలు లేకపోలేదు . తాము సరదా కోసం చేస్తున్నామని యువత భావిస్తున్న, ఇదొక వ్యసనంగా మారి వారిని ప్రమాదకర వీడియో లు తీసుకునే విధంగా పురిగొల్పుతుందని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు . టిక్ టాక్ లో వచ్చే ప్రమాదకర వీడియో లను తిలకించి ప్రభావితం అవుతున్నవారే, ఈ తరహా వీడియో లను తీసుకునేందుకు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు .