విజయదశమి పండుగ కు పాలపిట్ట కు అవినాభావ సంబంధం ఉంది. పండగ రోజు పాలపిట్ట ని చూస్తే అంతా శుభమే జరుగుతుందన్నది ఆనవాయితీగా వస్తోంది. అందుకే దసరా రోజు పాలపిట్ట ని చూడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎప్పుడో గానీ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు మాత్రం ఖచ్చితంగా ప్రజలకు దర్శనమివ్వడం అన్నది మరొక ప్రత్యేకత గా చెప్పుకుంటూ ఉంటారు . పండుగ రోజు పాలపిట్ట ను చూసేందుకు సాయంత్రం వేళల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు పొలాల్లోకి వెళ్తుంటారు . విజయదశమి పర్వదినాన గ్రామ శివార్లలోని పంటపొలాల్లో తళుక్కున మెరిసే పాలపిట్టను చూసి ప్రజలు , తమ అదృష్టానికి పొంగి పోతుంటారు.
దసరానాడు పాలపిట్ట ని సందర్శించే దర్శించడం అంటే అదొక అదృష్టంగా తమకు కలగబోయే విజయాలకు సూచనగా భావిస్తూ ఉంటారు. దసరా నాడు పాలపిట్ట ని చూడాలన్న సంప్రదాయానికి వెనుక ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకున్న తరువాత జమ్మి చెట్టుపైనున్న తమ ఆయుధాలను తీసుకుని వస్తుండగా వారికి పాలపిట్ట కనిపించిందని అది కూడా విజయదశమి రోజే కావడం తో ఆనాటినుంచి వారికి అన్ని విజయాలే చేకూరాయని , అందుకే పాలపిట్టను చూడడం అన్నది ఆనవాయితీగా వస్తోందని పెద్దలు చెబుతుంటారు .
గ్రామీణ ప్రాంతాలు కూడా కాంక్ర్టిట్ జంగిల్ గా మారుతున్న ప్రస్తుత తరుణం లో పాలపిట్టల కన్పించడం అన్నది అసాధ్యం గా పరిణమించడం తో, పాలపిట్టను చూసే భాగ్యం లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజించి ... పాలపిట్టను చూస్తేనే పండుగ పూర్తయినట్లని కానీ ప్రస్తుతం జమ్మి చెట్టు , పాలపిట్ట అన్నవి మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .