సాధారణంగా ఎండాకాలంలో ఏసీ వాడటం కామన్. చల్లటి ఏసీ గాలి వస్తుంటే హాయిగా అనిపిస్తుంది. ఇంటిలోనే కాదు.. ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ హబ్లలో ఏసీలను ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇతర కాలాల్లో కూడా ఏసీ లేనిదే చాలా మంది ఉండలేరు. ఏసీకి అలవాటు పడితే.. బయటకు వచ్చినప్పుడు ఏసీ బస్సో, లేదా ఏసీ క్యాబ్లో తప్ప అడుగు పెట్టాలంటే భయపడతారు. కానీ ఏసీ వాడడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.
ఏసీల్లో ఎక్కువగా ఉండే వారికి తలనొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అది మైగ్రేన్కు కూడా దారి తీయవచ్చు తెలుస్తోంది. పొడి చర్మం ఉన్న వారు ఏసీలో ఎక్కువసేపు గడపడం వల్ల చర్మంపై తేమ తగ్గుతుంది. చర్మం పొడిబారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఏసీ క్రింద కూర్చోవడం వాళ్ళ కళ్లలో స్రవించే ద్రవాల పరిమాణం తగ్గుతుంది. అందువల్ల కళ్లు పొడిబారిపోయి దురదలు పెడతాయి.
గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండడం అలవాటైన వారు ఇక ఏ మాత్రం వేడిని భరించలేరు. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతారు. అదేపనిగా ఏసీలో కూర్చొని పనిచేస్తే కండరాలకు తగినంత రక్తప్రసరణ జరుగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. అలాగే ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలు ఉన్నవారు ఏసీల్లో అస్సలు ఉండరాదు. అలాగే ఏసీ వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంతవరకూ ఏసీకి దూరంగా ఉండండి.