తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల ఫ్యామిలీ హవా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశబ్దాల కాలం నుంచి ఇక్కడ ఈ ఫ్యామిలీదే లీడింగ్. అందులోనూ జ్యోతుల నెహ్రూ హవా ఎక్కువ. అయితే ఆయన నిలకడలేని రాజకీయమే ఇప్పుడు జ్యోతుల చంటిబాబుకు ప్లస్ అయింది. నెహ్రూ మొదట్లో టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ నుంచి 1994, 99 ఎన్నికల్లో గెలిచిన నెహ్రూ...2004 లో ఓడిపోయారు. 

 

ఇక 2009లో నెహ్రూ ప్రజారాజ్యంలోకి వెళ్లిపోయారు. నెహ్రూ అటు వెళ్లడమే ఇటు చంటిబాబుకు టీడీపీ సీటు దక్కింది. అయితే ఆ ఎన్నికల్లో తోట నరసింహం చేతిలో నెహ్రూ, చంటిబాబులు ఓడిపోయారు. 2014 కి వచ్చేసరికి నెహ్రూ వైసీపీ నుంచి, చంటిబాబు టీడీపీల నుంచి పోటీ చేయగా, అప్పుడు నెహ్రూ గెలిచి, టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో చంటిబాబు రివర్స్ లో టీడీపీని వదిలి, వైసీపీలోకి వచ్చారు. 

 

2019 లో ఈ ఇద్దరే మళ్ళీ తలపడ్డారు. కాకపోతే నెహ్రూ టీడీపీ, చంటిబాబు వైసీపీ. అయితే ఈసారి మాత్రం విజయం చంటిబాబుకు దక్కింది. ఇక గెలిచిన దగ్గర నుంచి చంటిబాబు, తన పని తానూ సైలెంట్ గా చేసుకెళ్ళిపోతున్నారు. సౌమ్యుడిగా పేరొందిన చంటిబాబు, పెద్దగా వివాదాలు జోలికి వెళ్లకుండా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ఆదుకుంటున్నారు.

 

అయితే ప్రస్తుతానికి అనుకున్న మేర నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేదు. ముఖ్యంగా తాగునీటి సమస్యలు పరిష్కరించడంలో చంటిబాబు కాస్త వెనుకబడే ఉన్నారు. నెహ్రూ లాగా దూకుడుగా ఉంటూ, అధికారులకు చెప్పి చంటిబాబు పనులు చేయించుకోలేకపోతున్నారని టాక్. పైగా పనులు చేయించడంలో కాస్త నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుంన్నారని తెలుస్తోంది. 

 

కాకపోతే నియోజకవర్గంలో నెహ్రూ ఫ్యామిలీపై ఫుల్ వ్యతిరేకిత ఉంది. ఇక అదే చంటిబాబుకు ప్లస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో నెహ్రూ పోటీ నుంచి తప్పుకుని, ఆయన తనయుడు నవీన్ కుమార్ కు టికెట్ ఇప్పించుకునే అవకాశముందని తెలుస్తోంది. ఒకవేళ నవీన్ పోటీచేసిన, లేక నెహ్రూ పోటీచేసిన కూడా గెలుపు అంత సులువుగా రాదని అంటున్నారు. అదే చంటిబాబుకు కలిసొస్తుందని అంటున్నారు. మొత్తానికైతే నెహ్రూ ఉండటమే చంటిబాబుకు ప్లస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: