శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బాగా పట్టున్న నియోజకవర్గాల్లో రాజాం ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీదే విజయం. అది కూడా వరుసగా కంబాల జోగులు విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక్కడ టీడీపీ  పరిస్తితి దారుణంగా ఉండటంతో జోగులుకు తిరుగులేకుండా ఉంది. అయితే కంబాల జోగులు రాజకీయ జీవితం మొదలుపెట్టింది టీడీపీలోనే.

 

1999 ఎన్నికల సమయంలోనే ఈయన పాలకొండ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ అప్పుడు టికెట్ దక్కలేదు. ఇక 2004లో టికెట్ దక్కించుకుని వైఎస్ గాలిలో కూడా కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి 2009 ఎన్నికల్లో పాలకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడం, వైసీపీ ఆవిర్భవించడంతో అటు వెళ్ళిపోయారు. వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో రాజాం నుంచి పోటీ చేసి, టీడీపీ సీనియర్ నాయకురాలు ప్రతిభా భారతిపై కేవలం 512 ఓట్ల తేడాతో గెలిచారు.

 

అప్పుడు అధికారంలో లేకపోయినా...పార్టీని వదిలిపెట్టకుండా నియోజకవర్గంలో పనిచేసుకున్నారు. దాంతో 2019 ఎన్నికల్లో కూడా జగన్ టికెట్ ఇచ్చారు. ఈ సారి టీడీపీ తరుపున మాజీ మంత్రి కొండ్రు మురళి మోహన్ నిలబడ్డారు. అయినా సరే కంబాల జోగులు సూపర్ విక్టరీ కొట్టారు. సుమారు 17 వేల మెజారిటీ తేడాతో కొండ్రుని ఓడించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన జోగులు..నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

 

ఎక్కడిక్కడ పార్టీని బలోపేతం చేస్తూ దూసుకెళుతున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున కొండ్రు మురళి పెద్ద యాక్టివ్ గా ఏమి పనిచేయడం లేదు. దీంతో టీడీపీ కేడర్ ఎక్కువ శాతం జోగులు వైపు వెళ్ళిపోయారు. దీని వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి టీడీపీ వీక్ అవ్వడం వల్ల కంబాల జోగులుకు బాగా కలిసొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: