కర్నూలు జిల్లాలో వైసీపీ-టీడీపీల మధ్య హోరాహోరీ పోరు ఉండే నియోజకవర్గం ఎమ్మిగనూరు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ఎమ్మిగనూరు...2004లో వైఎస్ గాలిలో హస్తగతం అయింది. కాంగ్రెస్ తరుపున కె చెన్నకేశవ రెడ్డి బరిలో నిలిచి, టీడీపీ సీనియర్ నేత బి‌వి మోహన్ రెడ్డిని ఓడించారు. దాదాపు 18 వేల మెజారిటీతో చెన్నకేశవ రెడ్డి విజయం సాధించారు.

 

ఇక 2009 ఎన్నికల్లో వీరే ప్రత్యర్ధులుగా దిగగా, విజయం కూడా చెన్నకేశవ రెడ్డి వైపే నిలిచింది. 2 వేల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక తర్వాత వైఎస్సార్ మరణంతో, చెన్నకేశవ...జగన్ పెట్టిన వైసీపీలోకి వచ్చేశారు. ఆ వెంటనే 2012లో జరిగిన ఉపఎన్నికల్లో చెన్నకేశవ వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో బి‌వి మోహన్ రెడ్డి తనయుడు బి‌వి జయనాగేశ్వర్ రెడ్డి టీడీపీ తరుపున బరిలో దిగి, వైసీపీ అభ్యర్ధి కె జగన్ మోహన్ రెడ్డిపై విజయం సాధించారు.

 

2019 ఎన్నికల్లో మళ్ళీ చెన్నకేశవ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి టీడీపీ యువనేత జయనాగేశ్వర్‌ని ఓడించారు. ఇక నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన చెన్నకేశవ, నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ప్రజలకు వీలైనంత వరకు అందుబాటులో ఉంటున్నారు. అయితే ఎమ్మిగనూరు చేనేత రంగానికి కీలకంగా ఉంది. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు.

 

ఇక జగన్ ప్రభుత్వం నేతన్న హస్తం పేరిట చేనేత కార్మికులకు రూ.24 వేలు సాయం అందించారు. ఈ పథకం వల్ల చేనేత కార్మికులకు కాస్త ఆర్ధిక ఇబ్బందులు తగ్గాయి. దీంతో పాటు మిగతా పథకాలు కూడా సజావుగానే అందుతున్నాయి. కాకపోతే గతంలో టీడీపీ హయాంలో జరిగినట్లుగా...ఈ ఏడాదిలో వైసీపీ హయాంలో జరగలేదు. నిధులు సరిగా అందకపోవడం వల్ల అభివృద్ధి శూన్యమైంది.

 

అయితే టీడీపీ యువ నాయకుడు బి‌ఎన్ జయనాగేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలో ఫుల్ యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ..పార్టీని బలోపేతం చేస్తున్నారు. గత ఐదేళ్లు తాను చేసిన అభివృద్ధికి, ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అభివృద్ధికి తేడాలని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తున్నారు. ఇక ఎమ్మిగనూరు టీడీపీకి కంచుకోట కాబట్టి, జయనాగేశ్వర్‌కు త్వరగా పుంజుకునే అవకాశం దక్కింది. రానున్న రోజుల్లో కూడా జయనాగేశ్వర్‌తో చెన్నకేశవ్ రెడ్డికి ఇబ్బందే అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: